యోగ
సాధన ద్వారా వ్యక్తి జీవితంలో సమతుల్యత, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం (జూన్ 21) సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యోగ–టీటీడీ ఆరోగ్యానంద” కార్యక్రమాన్ని ఆదివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, జూన్ 7 నుంచి 21 వరకు టీటీడీ ఉద్యోగులందరూ క్రమం తప్పకుండా యోగ సాధనలో పాల్గొనాలని సూచించారు. యోగాభ్యాసం వల్ల ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందన్నారు. ప్రారంభంలో యోగ కొంత కష్టంగా అనిపించినప్పటికీ, నిరంతర సాధన ద్వారా శరీరం, మనస్సుపై సంపూర్ణ నియంత్రణ సాధించవచ్చని చెప్పారు. యోగతో శారీరక దృఢత్వం, మానసిక వికాసం, అంతర్గత చైతన్యం పెంపొందుతాయని వివరించారు.
మానసిక ఒత్తిడికి యోగానే ఉత్తమ పరిష్కారం : అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి
నేటి వేగవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు, వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి యోగ సాధన అత్యంత అవసరమని అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి అన్నారు. యోగ ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, భావోద్వేగ నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు.
భయం, ఆందోళన, ఉద్వేగాల వంటి ప్రతికూల భావోద్వేగాలను అధిగమించి మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు యోగ ఒక అద్భుతమైన సాధనమని పేర్కొన్నారు. స్వామి వివేకానందుడు, గౌతమ బుద్ధుడు వంటి మహనీయులు సైతం యోగ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తు చేశారు.
ఆధ్యాత్మికతకు యోగ వారధి : జేఈవో డా. ఎ. శరత్
యోగ అనేది కేవలం ఆరోగ్య సాధన మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక వికాసానికి మార్గదర్శకమని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అన్నారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు జూన్ 20 వరకు యోగా ప్రామాణిక విధానాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఉద్యోగి ప్రతిరోజూ ఉదయం జరిగే యోగాభ్యాసంలో పాల్గొనాలని కోరారు. యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 18, 19, 20 తేదీలలో ఉద్యోగులకు యోగ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 21న టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
అంతకుముందు టీటీడీ పరిపాలనా భవనం, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, స్విమ్స్, బర్డ్, శ్వేత భవనం, ఎస్వీ సంగీత కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం తదితర కేంద్రాలలో ఉద్యోగులు, విద్యార్థులు, సిబ్బంది గంటపాటు యోగాసనాలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా మహతి కళాక్షేత్రానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహతి కళాక్షేత్రంలో ఎస్వీబీసీ రూపొందించిన యోగాపై ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం యోగా మాస్టర్ శ్రీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సూర్యనమస్కారాలు, వివిధ యోగాసనాల ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక పూజలు, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.
టిటిడి ఆలయాల్లోని వివిధ ప్రాంతాల్లో టిటిడి ఆరోగ్యానంద ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎస్వీడబ్ల్యూ కళాశాల తెలుగు విభాగాధిపతి డా. కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, టీటీడీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, స్విమ్స్ డైరెక్టర్ శ్రీ ఆర్వీ కుమార్, హెచ్డీపీపీ ఇన్చార్జ్ కార్యదర్శి డా. మేడసాని మోహన్, డిప్యూటీ ఈవోలు శ్రీ ఆనందరాజు, శ్రీ గోవిందరాజన్, శ్రీ శివప్రసాద్, శ్రీ సెల్వం, సీఎంవో శ్రీమతి కుసుమకుమారి, వీజీవో శ్రీ గిరిధర్, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, శ్రీవారి సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No comments :
Write comments