19.5.25

స్వర్ణరథంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు






శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి స్వర్ణరథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ర‌థాన్ని లాగారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేప‌ట్టారు.
మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనం‌తో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి పి.వ‌ర‌ల‌క్ష్మి, ఈఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ దామోదరం, ఏఈవో శ్రీ ఎం. గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ వి.రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ డి.మునికుమార్, ఎం ధోనీ శేఖర్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments