శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్సేవ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వసంతోత్సవాలు 19వ తేదీ వరకు జరుగనున్నాయి.
మే18న స్వర్ణరథోత్సవం
మే 18వ తేదీ ఆదివారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో నిత్యకల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ ముని రాజా, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ముని కుమార్, ఆలయ అర్చకులు , విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



No comments :
Write comments