అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా మేదినిపూజ చేపట్టారు. ఆ తరువాత సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా శ్రీ విష్వక్సేనులవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని ప్రతీతి. ఆ తరువాత యాగశాలలో అంకురార్పణం నిర్వహించారు.
జూన్ 7న అప్పలాయగుంటలో ధ్వజారోహణం :
జూన్ 7వ తేదీ శనివారం ఉదయం 7.30 నుండి 8.00 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో కంకణ బట్టర్ శ్రీ తిప్పయ్య ఆచార్యులు, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్ ఏఈఓ శ్రీ దేవరాజులు, ఏవీఎస్వో శ్రీ సతీష్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.




No comments :
Write comments