విజయవాడ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణకు శనివారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు మృత్సంగ్రహణము, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
టీటీడీ అనుబంధ ఆలయాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అష్టబంధన మహా సంప్రోక్షణ చేపట్టడం ఆచారంగా వస్తోంది.
ఇందులో భాగంగా జూలై 27వ తేదీ ఉదయం 9 నుండి 12 గంటల వరకు అగ్ని ప్రతిష్ట, సాయంత్రం 6.30 గంటలకు కళాపకర్షణ, ఉక్త హోమములు చేపడతారు. జూలై 28న ఉదయం 9 గం.లకు నవగ్రహారాధన, ప్రధాన హోమములు, సాయంత్రం 6.30 గంటలకు ఉత్క హోమములు, కుంభ రాధనలు, అభి మంత్రణము నిర్వహిస్తారు. జూలై 29వ తేదీన ఉదయం 9 గంటలకు సర్వ శాంతి హోమములు, సాయంత్రం 6.30 సర్వ దోషాపశమనార్ధము సహస్రాహుతి హోమములు నిర్వహించనున్నారు.
జూలై 30వ తేదీ ఉదయం 9 గంటలకు అష్టబంధన ద్రవ్యా రాధనము, మహా శాంతి హోమాలు, ఉష్ణ బంధనము, అష్టబంధ ప్రయోగము, సాయంత్రం 4 గంటలకు సర్వ దోషప్రాయశ్చిత్త శాంతి హోమాలు, రాత్రి 7 గంటలకు మహా శాంతి తిరుమంజనము, ధాన్యా ధివాసము, సర్వ దైవత్య హోమము నిర్వహిస్తారు.
జూలై 31వ తేదీ ఉదయం 7.30 గంటలకు మహా పూర్ణాహుతి నిర్వహించనున్నారు. అనంతరం చిత్త నక్షత్రం, తులాలగ్నంలో ఉదయం 11.25 నుండి మధ్యాహ్నం 12.24 గంటల వరకు కళావాహనం, ప్రథమ కాలార్చన, మహా సంప్రోక్షణ, అక్షతారోహణ, బ్రహ్మ ఘోష తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో కంకణభట్టార్ గా శ్రీ మురళి కృష్ణ స్వామి అయ్యంగార్ గారు, ఋత్విక్కులుగా శ్రీ వేదాంతం వేంకట శశి కిరణ్ గారు మరియు ఇతరులు నిర్వహింపగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, శ్రీ నాగభూషణం గారు, సూపరింటెండెంట్, శ్రీ ఎమ్.మల్లికార్జున గారు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి లలిత రమాదేవి పాల్గొన్నారు.




No comments :
Write comments