26.9.25

శ్రీ‌వారి చిన్న‌శేష‌ వాహ‌న సేవాలో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు cultural fete






తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉద‌యం చిన్న‌శేష వాహ‌న సేవ‌లో మలయప్ప స్వామి విహరించుచుండగా 18 కళాబృందాలు 430 మంది కళాకారులు తమ కళా విన్యాసాలను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించి ఆహుతులను అబ్బురపరిచారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అస్సాం, కేరళ, త్రిపుర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మరియు పాండిచ్చేరి మొత్తం 10 రాష్ట్రాల నుండి వచ్చిన వివిధ  కళా బృందాలు వీక్షకులను భక్త్యావేశాన్ని కలిగించాయి.
విశాఖపట్టణానికి చెందిన శ్రీ‌మ‌తి సునీత బృందం ప్రదర్శించిన గోవింద గానం నృత్యం కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వైభవాన్ని చాటినది. తెలంగాణకు చెందిన శ్రీ‌ గౌరవి రెడ్డి బృందం ప్రదర్శించిన కుంభ మయూర నృత్యం నెమళ్లు సంచరించినట్లుగా అనిపించినది. మహారాష్ట్రకు చెందిన శ్రీ తరుణ శేఖర్ బృందం ప్రదర్శించిన మహారాష్ట్ర జానపద నృత్యం మెరుపు వేగంతో ఔరా! అనిపించాయి.
కర్ణాటకకు చెందిన డాక్టర్ దర్శిని మంజునాథ్ బృందం ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలా తరంగిణి నృత్యరూపకం భాగవతంలోని అనేక ఘట్టాలను గుర్తుకు తెచ్చినది. మండపేటకు చెందిన వీరవేణి బృందం ప్రదర్శించిన కోలాటం, కడప జిల్లాకు చెందిన సి. బాబు బృందం చేసిన డ్రమ్ము లయ విన్యాసాలు, విశాఖపట్నానికి చెందిన ఎం. లక్ష్మి బృందం ప్రదర్శించిన శ్రీకృష్ణ రసలీల రూపకం బృందావనం మధుర ప్రదేశాలలో శ్రీకృష్ణుడు గోపికలతో క్రీడించిన రాసకేలిని గుర్తుకు తెచ్చినది.
కేరళకు చెందిన అభిషేక్ బృందం ప్రదర్శించిన కథకళి నృత్యం, పాండిచ్చేరికి చెందిన కె.తిరుముగన్ ప్రదర్శించిన కరగట్టం నృత్యం, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల నుండి డాక్టర్ ఉషారాణి ప్రదర్శించిన దేవేరుల చిన్నవాహన సేవ, మహారాష్ట్రకు చెందిన  రాహుల్ హల్డే బృందం ప్రదర్శించిన హోలీ  నృత్యం, సి.హెచ్. అజయ్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, గూడూరుకు చెందిన శైలజా కుమారి బృందం ప్రదర్శించిన భక్త ప్రహ్లాద రూపకం భాగవతంలోని ప్రసాద చరిత్రను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. అస్సాంకు చెందిన జోయ్ దేవ్ దేకా బృందం ప్రదర్శించిన బోర్తాల్ నృత్యం అస్సామీ ప్రజల సంస్కృతి వైభవాన్ని చాటినది. పశ్చిమబెంగాల్ కు చెందిన ప్రసూన్ బెనర్జీ బృందం ప్రదర్శించిన జుహ్మార్ నృత్యం ఆ రాష్ట్ర సంస్కృతిని కనుల ముందు సాక్షాత్కరింపచేసినది.
త్రిపురకు చెందిన రాజు మోగ్ బృందం ప్రదర్శించిన సన్గ్రైన్ గొడుగు నృత్యం నర్తకులు జంటలుగా గొడుగులతో కలిపి  ఒకరినొకరు కలిసి చేస్తున్న నాట్యం ఈ కళ త్రిపుర సంస్కృతిని ప్రతిబింబించినది.
తూర్పు గోదావరి జిల్లా, తణుకుకు చెందిన పి.హారిక బృందం, తిరుమలకు చెందిన కె.శ్రీనివాసులు కోలాట నృత్యాలతో భక్తులను తన్మయ పరచారు.

No comments :
Write comments