28.9.25

శ్రీవారి గరుడ సేవకు వచ్చే ప్రతి భక్తుడికి టిటిడి సేవలు అందాలి ttd jeo





శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత ప్రముఖమైన గరుడసేవకు విచ్చేసే లక్షలాది మంది  భక్తులకు టిటిడి సేవలు అందించాలని టిటిడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం కోరారు. ప్రత్యేక విధులలో భాగంగా గరుడ సేవకు వచ్చిన  ఉద్యోగులు సమిష్టిగా భక్తులకు సేవలు అందించాలన్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శనివారం సాయంత్రం ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో సమన్వయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ,  తిరుమల నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తుల సౌకర్యార్థం ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు సమన్వయం చేసుకుని తిరుమలలోని గ్యాలరీలలోను, జౌట్ సైడ్ క్యూలైన్లు, వీక్యూసీ -2 క్యూలైన్లు, బయట ప్రాంతాలలో ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు తదితరాలు అందేలా ముందస్తుగా నిల్వ ఉంచుకుని ప్రణాళిక బద్ధంగా పంపిణీ చేయాలని సూచించారు.  పరిష్కరించలేని సమస్య ఏదైనా తలెత్తితే తక్షణం ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. ప్రత్యేక విధులలో భాగంగా తిరుమలలో సేవలు అందించేందుకు వచ్చిన ప్రతి ఉద్యోగి తమకు కేటాయించిన విధులను బాధ్యాతాయుతంగా నిర్వర్తించాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్నప్రసాదాలు,  త్రాగునీటి కొరత, భక్తులకు అనుకోకుండా ఆరోగ్య సమస్యలు, విద్యుత్ సమస్యలు తలెత్తితే తక్షణం నివారించేందుకు సంబంధిత సదరు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివారం ఉదయం నుండి గ్యాలరీలలోని భక్తులకు త్రాగునీరు, పాలు, అల్పాహారం అందించేంచుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
సివిఎస్ఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ మాట్లాడుతూ, వాహన సేవలు పూర్తయిన వెంటనే ఎలాంటి అవాంతరాలు లేకుండా భక్తులను బయటకు పంపేందుకు ప్రణాళిక బద్ధంగా ప్రతి వీధికి ఒక అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను తరలించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులు కమాండ్ కంట్రోల్‌ను సంప్రదించి సమస్యను తెలియజేయాలని కోరారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, గ్యాలరీలలోనూ, నాలుగు మాడ వీధులలో హారతి పాయింట్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్యాలరీలలోని ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు అందేలా ఉద్యోగులు, పోలీసులు, శ్రీవారి సేవకులు సమన్వయంతో సేవలు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ టి.వి.సత్యనారాయణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి శ్రీ జీ.ఎ.ల్ఎన్.శాస్త్రి తదితర అధికారులు, సెక్టోరల్ అధికారులు, సీనియర్ అధికారులు, ఇన్‌ఛార్జ్ అధికారులు, డిప్యుటేషన్ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

No comments :
Write comments