18.10.25

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి జేఈవో ttd jeo









తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను టిటిడి అధికారులతో కలిసి శుక్రవారం టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం పరిశీలించారు.


ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అమ్మ‌వారి బ్రహ్మోత్సవాలకు నవంబర్ 15 లోపు ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీ నేపథ్యంలో ముంద‌స్తుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వాహనసేవల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల కళాబృందాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి అన్నప్రసాదాలను తయారు చేసుకోవాలన్నారు.

భక్తులకు సరిపడా తాత్కాలిక, మొబైల్‌ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలని జెఈవో సూచించారు. భక్తులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు అంబులెన్సులు, మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. టీటీడీ నిఘా, భద్రతా అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమితీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు, పారిశుద్ధ్యం  పనులకు అదనపు సిబ్బందిని  నియమించుకోవాలన్నారు.

పంచమితీర్థం రోజున విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా భక్తులు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, పూడి వద్ద జర్మన్ షెడ్లు  ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు  తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలన్నారు.

టిటిడి జేఈవో అధికారులతో కలిసి పద్మసరోవరం, నాలుగు మాడ వీధులు, తోళ్ళప్ప గార్డెన్స్, ఫ్రైడే గార్డెన్స్, ఎగ్జిబిషన్ ప్రాంతం, ఉద్యానవన ప్రదర్శన శాల, జిల్లా పరిషత్ హైస్కూల్, పూడి హోల్డింగ్ పాయింట్, నవజీవన్  ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సమావేశంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, శ్రీ సెల్వం, ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ జగదీశ్వర్ రెడ్డి, గార్డెన్ డిప్యూటీ  డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ శ్రీ సునీల్, సీఎంవో శ్రీమతి నర్మద, ఏవీఎస్వో శ్రీ రాధాకృష్ణ , అర్చకులు శ్రీ బాబు స్వామి, తదితర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments