12.11.25

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలి– - టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్







తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరు ఆస్థానమండంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి సీవీఎస్వో శ్రీ కే. వి. మురళీకృష్ణ లతో కలసి టిటిడి సమీక్ష నిర్వహించారు.  


 ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ,  తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే  రెండుమార్లు జిల్లా ఎస్పీ, టిటిడి సివిఎస్వో, టిటిడి జేఈవో సమీక్ష నిర్వహించారు. తిరుచానూరు ఆలయం పరిసరాలలోను, పద్మసరోవరం,  హోల్డింగ్ పాయింట్లు వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజు దాదాపు 75 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు అన్నప్రసాదాలు సిద్ధం చేసుకోవాలని, పటిష్ట క్యూలైన్లు, జర్మన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులు, వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.  దాదాపు  600 మంది పోలీసులు, 700 మంది టిటిడి సెక్యూరిటీ , 900 మంది శ్రీవారి సేవకులు, 2 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందిస్తారన్నారు.

అదేవిధంగా,  రోజువారి 10 వేల మందికి అన్నప్రసాదాలు, పంచమి తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్లలో దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు వేచియుండే అవకాశం ఉందన్నారు. తిరుమల తరహాలో విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపడుతారన్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ సిపి రాధాకృష్ణన్ వచ్చారని, శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపతి ముర్ము వస్తున్నారని చెప్పారు. తిరుచానూరులో భారత రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

తిరుచానూరులో ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయాలకు మహిళా భక్తుల సంఖ్య పెరుగుతోందని, బ్రహ్మోత్సవాలకు మరింత రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తిరుచానూరు  బ్రహ్మోత్సవాలకు భక్తులను టిటిడి ఈవో ఆహ్వానించారు.  

అంతకుముందు, టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గౌ. శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నవంబర్ 17వ తేది సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీ పద్మావతీ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని తెలిపారు. 
 
తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ, నవంబర్ 25న పంచమి తీర్థం ఉత్సవాన్ని పురష్కరించుకుని శ్రీవారి ఆలయం నుండి వచ్చే సారె ఊరేగింపు సందర్భంగా  తిరుపతి నగరంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జిల్లా  ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈ ఏడాది పంచమి తీర్థం రోజున పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు అవగాహన కల్పించేందుకు ఈసారి మహిళా పోలీసులను ఎక్కువ మందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

టిటిడి సివిఎస్వో మాట్లాడుతూ,  బ్రహ్మోత్సవాలకు అవసరమైన సిసి  కెమెరాల‌ను , సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి నాలుగు మాడ వీధులలోను, పంచమి తీర్థం రోజున ప్రవేశ, నిష్క్రమణ మార్గాల యందు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అంతకుముందు టిటిడి ఈవో, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జేఈవో, సివిఎస్వోలు అధికారులతో కలిసి ఆలయ వాహన మండపం, నాలుగు మాడ వీధులలో, పద్మసరోవరణం, గేట్ నెంబర్ - 4, జెడ్పీ హైస్కూల్, పూడి, నవజీవన్ హోల్డింగ్ పాయింట్లను పరిశీలించారు.  

ఈ స‌మావేశంలో ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, శ్రీ మణికంఠ స్వామి, సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఎఫ్.ఎ అండ్ సీఏవో శ్రీ ఓ బాలాజీ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, పలువురు ఇతర అధికారులు  పాల్గొన్నారు.

No comments :
Write comments