2.11.25

పండుగ వాతావరణం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు - జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం వారం రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలి padmavati ammavari brahmotavalu





తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పండుగ వాతావరణం తరహాలో ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జేఈవో శ్రీ వీ. వీరబ్రహ్మం అధికారులకు సూచించారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ,  భక్తుల రద్దీని ముందస్తుగా అంచనావేసుకుని అందుకుతగ్గట్లు వారం రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. శాఖలవారీగా అనుమతులు పెండింగ్ లో ఉంటే వెంటనే అప్రోవల్ తీసుకుని పనులను వేగవంతం చేయాలన్నారు. అమ్మవారి గరుడ వాహన సేవ, గజ వాహన సేవ, పంచమి తీర్థం రోజున భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని, భక్తుల రద్దీకి తగ్గట్లు అన్నప్రసాదాలు, క్యూ లైన్లు, సెక్యూరిటీ, పద్మసరోవరంకు ప్రవేశం, నిష్క్రమణ, మెడికల్, పారిశుద్ధ్యం పనులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.  తిరుమలలో విద్యుద్దీపాలంకారాలు, ఫలపుష్ప ప్రదర్శన  ఏవిధముగానైతే భక్తులను ఆకట్టుకున్నాయో అదేరీతిలో తిరుచానూరులో ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్‌ , గార్డెన్ విభాగాధికారులను ఆదేశించారు.  తిరుపతి, తిరుచానూరు పరిసర ప్రాంతాలు పారిశుభ్రంగా ఉండేలా పంచాయతీ అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.

నవంబర్ 16 అంకురార్పణ నుండి పంచమి తీర్థం వరకు అధికారులు రాజీపడకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. గత  అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు, రంగోళీలు, పిఏ సిస్టమ్‌, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉండాలన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదాలు అందించేలా నవజీవన్, తోళప్ప గార్డెన్స్, పూడీ, హైస్కూల్ ప్రాంతాలలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమి తీర్థం రోజున అలిపిరి నుండి తిరుచానూరు వరకు పడి ఊరేగింపులో భక్తులకు ముందస్తుగా సమాచారం తెలిసేలా ప్రకటనలు ఇవ్వాలని, భక్తులకు తాగునీరు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య సేవలు తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.   అదేవిధంగా, పోలీసు, రెవెన్యూ, పంచాయ‌తీ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల‌కు ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. బ్రహ్మోత్సవాలకు అవసరమైన శ్రీవారి సేవకులను సమీకరించుకోవాలన్నారు. ఎస్వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలను అందించాలన్నారు. శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన జేఈవో అధికారులకు పలు సూచనలు చేశారు.    

బ్రహ్మోత్సవాల వాహన సేవల వివరాలు.

-  నవంబరు 11వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు

- 17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం( ధనుర్ లగ్నం)      చిన్నశేషవాహనం

- 18-11-2025(మంగళ వారం) పెద్దశేషవాహనం                     హంసవాహనం

- 19-11-2025(బుధవారం)     ముత్యపుపందిరి వాహనం        సింహవాహనం

- 20 -11-2025(గురువారం)   కల్పవృక్ష వాహనం                  హనుమంత వాహనం

- 21 -11-2025(శుక్ర వారం)      పల్లకీ ఉత్సవం                           గజవాహనం
 
- 22-11-2025(శనివారం)     సర్వభూపాలవాహనం      సా.  స్వర్ణరథం,     గరుడవాహనం
 
- 23-11-2025(ఆదివారం)    సూర్యప్రభ వాహనం         చంద్రప్రభ వాహనం
 
- 24-11-2025(సోమవారం)      రథోత్సవం                   అశ్వ వాహనం
 
- 25-11-2025(మంగళవారం)     పంచమీతీర్థం               ధ్వజావరోహణం.

- నవంబర్ 26న పుష్పయాగం.

ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఎఫ్ఎఅండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఐటి జీఎం శ్రీ డి. పణికుమార్ నాయుడు పలువురు డిప్యూటీ ఈవోలు, అర్చకులు శ్రీ బాబు స్వామి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments