నూతనంగా వివాహం చేసుకునే పెళ్లి కుమారై, పెళ్లి కుమారుడికి శ్రీవారి దీవెనలతో అక్షింతలు, కుంకుమ, కంకణం, శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీపద్మావతీ అమ్మవారి ఫోటోలతో కూడిన ఆశీర్వచనం పత్రిక, 'కల్యాణ సంస్కృతి' పుస్తకం టీటీడీ అందిస్తోంది. ప్రతి ఏడాది శుభలేఖ పంపిన లక్షకు పైగా వధువరులకు శ్రీవారి దీవెనలతో కల్యాణం జరుగుతోంది.
నూతన వధువరులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి విశిష్టమైన వివాహానికి కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంది. ఈ మహత్తర అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. ఇందుకు చేయాల్సింది పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపాలి.
నవసమాజంలో గృహస్థ ధర్మం కీలకమైనది. వధువరుల కల్యాణంలో మొదటి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఉపద్రవాల నుండి రక్షించే రక్షాబంధనమైన కంకణాలను వరుడి కుడిచేతికి, వధువు ఎడమ చేతికి ధరింపచేస్తారు. ఇందుకోసం శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు కోరుతూ కుంకుమ, కంకణధారణకు కంకణం పంపుతారు.
వివాహంలో భాగంగా చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉంది. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని, సత్కర్మలు పెంపొందాలని, దాంపత్యం ఫలప్రదం కావాలని, భార్యాభర్తలు పరస్పరం ప్రీతిపాత్రులు కావాలని, సిరిసంపదలు కలగాలని టిటిడి కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతోంది.
నూతన వధువరులకు వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు ''కల్యాణ సంస్కృతి'' పేరిట ఓ పుస్తకాన్ని, శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ పద్మావతీల ఫోటోలతో కూడీన వేద ఆశీర్వచన పత్రికను టిటిడి కార్యనిర్వహణాధికారి పేరిట పంపుతారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల శుద్ధ ప్రతి విభాగం (తపాలా విభాగం) సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ప్రతి సంవత్సరం లక్షకు పైగా నూతన జంటలకు శ్రీవారి అశీస్సులు అందిస్తున్నారు.
శ్రీవారి ఆశీస్సులు ఎలా పొందాలి :
శ్రీవారి ఆశీస్సులు పొందగోరు నూతన వధూవరులు తమ పూర్తి చిరునామాతో ''కార్యనిర్వహణాధికారి, టిటిడి పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి - 517501'' పేరిట వివాహ పత్రికను పంపాలి. మరిన్ని వివరాలకు కాల్ సెంటర్ నెం.155257 సంప్రదించగలరు.

No comments :
Write comments