తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 25న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుధ్ధి నిర్వహించారు. ఆనంతరం ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు.
12 పరదాలు విరాళం :
హైదరాబాదుకు చెందిన శ్రీ శ్రీనివాసులు రెడ్డి 4, శ్రీ స్వర్ణకుమార్ రెడ్డి 7, చెన్నైకి చెందిన శ్రీ శ్రీనివాస్ - 1 అనే భక్తులు ఈ సందర్భంగా ఆలయానికి మొత్తం 12 పరదాలను విరాళంగా అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్లు శ్రీ సురేష్, శ్రీ రమేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
No comments :
Write comments