టిటిడి
బర్డ్ ఆసుపత్రిలో అందుతున్న వైద్యం పట్ల చికిత్స పొందుతున్న రోగుల ముఖాలలో చాలా సంతోషం కనిపిస్తోందని టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ వెల్లడించారు. బర్డ్ డైరెక్టర్ డా. జి. జగదీశ్ తో కలిసి జేఈవో డా. ఎ. శరత్ సోమవారం బర్డ్ ఆసుపత్రిని పరిశీలించారు.
ఈ సందర్భంగా జేఈవో (వైద్యం & విద్య) మాట్లాడుతూ, బర్డ్ ఆసుపత్రిని జాతీయ స్థాయిలో నిలబెట్టేలా వైద్య సేవలు అందించాలని కోరారు. బర్డ్ ఆసుపత్రిలో సర్జరీల సమయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం నెలకు 10 వేల ఓపీలు, 7 వేల సర్జరీలు జరుగుతున్నాయని, ఓపీ సేవలను, సర్జరీల సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సర్జరీలకు వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది, మందులు, పరికరాలను సమకూర్చుకోవాలని కోరారు. మోకాలి మార్పిడి, తదితర శస్త్ర చికిత్సలకు ఉపయోగించే అవసరమైన పరికరాలను మరింత నాణ్యంగా ఉండే వాటిని ఎంపిక చేసుకోవాలన్నారు. కృత్రిమ కాలు తయారీకి అవసరమైన సిబ్బందిని, వస్తు సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. బర్డ్ లో వైద్య సేవలకు గ్రామీణ ప్రాంతాల రైతులకు, నిరుపేదలు వస్తున్నారని వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. దివ్యాంగ పిల్లలకు సర్జరీలను తక్షణం చేయాలని, జాయింట్ రీప్లేస్మెంట్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యులకు సూచించారు.
అనంతరం బర్డ్ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అందుతున్న సదుపాయాలు, వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అత్యవసర వార్డు, జనరల్ వార్డు, ఓపి వార్డులను, కృత్రిమ కాలు తయారీ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అన్నప్రసాదాల నాణ్యత గురించి రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. వెంకట రెడ్డి, ఎస్ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, శ్రీ నరసింహ మూర్తి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments