శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది.
వసంతఋతువులో స్వామికి జరిగే ఈ ఉత్సవానికి ’వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించడం కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.
బ్రహ్మోత్సవాలలోస్వామి, అమ్మవార్లు ఉదయం, సాయంత్రం అలంకరణలు, వాహనసేవల్లో పాల్గొని అలసి వుంటారు. వారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
వసంతోత్సవంలో చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భక్తులు అహ్లాదకరంగా వసంతాలు ( గంథం కలిపిన నీళ్ళు) చల్లుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments