తిరుమల శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి మార్చి 31, ఏప్రిల్ 01 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
- భక్తుల భద్రత దృష్ట్యా తుంబురు తీర్థానికి మార్చి 31న మరియు ఏప్రిల్ 1వ తారీఖులలో ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.
- పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీటిని 100 మంది శ్రీవారి సేవకులు ద్వారా పంపిణీ చేస్తారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.
- తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో వృద్దులకు, 12 ఏళ్లలోపు చిన్నారులకు, దీర్ఘవ్యాధిగ్రస్తులకు, గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు.
- భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
- పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.
- తీర్థానికి వెళ్లే మార్గంలో సూచి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.
No comments :
Write comments