తిరుపతిలోని
శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) ఆధ్వర్యంలోని టిటిడి ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ పేద వర్గాల ప్రాణాలకు వరంగా నిలుస్తోంది. రాయలసీమ జిల్లాలలో గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్, న్యూరో సంబంధిత ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఖరీదైన వైద్య చికిత్సలను ఉచితంగా అందించాలనే దివ్యసంకల్పంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను 2001 అక్టోబర్ 01న ప్రారంభించారు.
ఈ మహోన్నత సేవా కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో కొనసాగుతూ, పేద రోగులకు ప్రాణాధారంగా నిలుస్తోంది.
దీర్ఘకాలిక వ్యాధులకు సహాయం
ఈ ట్రస్ట్ ద్వారా దీర్ఘకాలిక మరియు నిర్ధిష్ట వ్యాధుల చికిత్సతో పాటు వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా – దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, హీమోఫిలియా, థలసేమియా, క్యాన్సర్, గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు, అటాక్సియా, కొరియా, హెమిబాలిస్మస్, అఫాసియా వంటి న్యూరోలాజికల్ తదితర వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులకు ఉపశమనం కలిగేలా ప్రణాళికాబద్ధ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పేద రోగులకు వైద్య ఖర్చులు, శస్త్రచికిత్సలు, కృత్రిమ అవయవాలు, ఇంప్లాంట్లు, బ్లడ్ బ్యాంక్ లాంటి వైద్య సేవలను ఎలాంటి వివక్ష లేకుండా అందిస్తున్నారు.
ఆర్థిక సహాయం పెంపు
పేద రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ నుండి వివిధ దశల్లో నిధులను పెంచుతూ వచ్చారు: 22.02.2003వ తేదీ నుండి నెలకు రూ. 15 లక్షలు, 30.04.2005 – రూ. 25 లక్షలు, 24.03.2006 – రూ. 30 లక్షలు, 30.01.2008 – రూ. 50 లక్షలు, 02.04.2014 – నెలకు రూ. 1 కోటి ఖర్చు చేస్తున్నారు.
దాతల సహకారం
ఎస్వీ ప్రాణ దాణ ట్రస్ట్ కు ఇప్పటి వరకు 51,957 మంది దాతలు దాదాపు రూ. 520 కోట్లును విరాళాలను అందించారు.
2001, నవంబర్ నుండి 2026, ఫిబ్రవరి వరకు దాదాపు రూ. 158 కోట్ల ఖర్చుతో సుమారు 27,710 పైచిలుకు రోగులు ఈ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలను పొందారు.
ఎంపిక విధానం
దారిద్య్ర రేఖకు దిగువనున్న రోగులను ఎస్వీ ప్రాణదాన ఎంపిక కమిటీ పరిశీలించి ఉచిత చికిత్సకు ఎంపిక చేస్తుంది. కన్సల్టెంట్ వైద్యుడు ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. ఆరోగ్య కార్డులు, అధికార రికార్డులు పరిశీలిస్తారు. చికిత్స ఖర్చు అంచనా వేసి ఆమోదం పొందిన తర్వాత వైద్య సేవలు అందిస్తారు. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వీసీ ద్వారా పంపిన కేసులను డా. ఎన్.టి.ఆర్. వైద్య సేవా ట్రస్ట్ పోర్టల్లో తనిఖీ చేసి నమోదు చేస్తారు. అత్యవసర కేసుల్లో తక్షణ ధృవీకరణతో చికిత్స అందిస్తారు.
ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ – రక్తదాన సేవల విస్తరణ
2007లో ప్రారంభమైన ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ రక్తదాన సేవలను విస్తృతంగా అమలు చేస్తోంది. ఉచిత రక్తం మరియు రక్త భాగాల పంపిణీ, స్వచ్ఛంద రక్తదాన ప్రోత్సాహం, అత్యవసర సేవలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, టిటిడి పరిధిలోని రక్తనిధుల ద్వారా సేకరించిన రక్తాన్ని పూర్తిగా ఉచితంగా అందించడం ఈ ట్రస్ట్ ప్రత్యేకత. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ప్రమాద బాధితులు, గుండె శస్త్రచికిత్స రోగులు, థలసేమియా చిన్నారులు, అత్యవసర శస్త్రచికిత్స రోగులకు తక్షణ సహాయం అందిస్తూ అనేక ప్రాణాలను కాపాడుతోంది.
భక్తుల భాగస్వామ్యం
“ఒక యూనిట్ రక్తం – మూడు ప్రాణాలకు ఆశ” అనే నినాదంతో యువతను రక్తదానానికి ప్రేరేపిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తిరుమలకు విచ్చేసే భక్తులు తమ దర్శన యాత్రను రక్తదానంతో మరింత పుణ్యమయంగా మార్చుకుంటున్నారు. టిటిడి పర్యవేక్షణలో నడిచే ఈ ట్రస్ట్ పూర్తిస్థాయి పారదర్శకతతో సేవలను అందిస్తోంది. రక్త సేకరణ, నిల్వ, పరీక్షలు, పంపిణీ ప్రక్రియల్లో జాతీయ వైద్య ప్రమాణాలను పాటిస్తోంది.
సమాజానికి సందేశం
ప్రాణదానం అనేది పరమదానం. ఒకరి రక్తదానం మరొకరి జీవితాన్ని కాపాడగలదు, ఒకరి ఆర్థిక సహాయం మరొకరి ప్రాణాలకు ఆధారం అవుతుందనే సేవ దృక్పథంతో వైద్య సేవలను అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో కొనసాగుతున్న ఈ ప్రాణదాన సేవలు మరింత విస్తరించి, మరెన్నో పేద కుటుంబాలకు వెలుగులు నింపేందుకు టిటిడి కృషి చేస్తోంది.
No comments :
Write comments