టీటీడీ
హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా టీటీడీ పంచాంగ పరిష్కర్త మరియు ఆగమ సలహా మండలి అధ్యక్షులు వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు. పూర్వం రాజులు ప్రతిరోజూ పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్యఫలమని అన్నారు. శ్రీవేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. అనంతరం ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. అనంతరం పంచాంగకర్తను శ్రీవారి ప్రసాదం, నూతన వస్త్రాలతో సన్మానించారు.
ఆ తరువాత ఉదయం 11 నుండి 12:30 గంటల వరకు ఎస్వీ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ఆచార్య దామోదర్ నాయుడు కవి సమ్మేళనం నిర్వహించారు.
ముందుగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు చక్కగా మంగళధ్వని, ప్రార్థన వినిపించారు. ఆ తరువాత ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి శ్రీ రఘునాథ్, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు, ఇతర అధికారులు, ఉద్యోగులు, పుర ప్రజలు పాల్గొన్నారు.
No comments :
Write comments