భారత
రాజ్యాంగ శిల్పి డా. బీఆర్ అంబేద్కర్ జయంతి సమ సమాజ నిర్మాణానికి మార్గదర్శి అని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం నిండా సమానత్వ సందేశం మార్మోగింది. భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను టిటిడి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, డా. అంబేద్కర్ జయంతి కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా సమ సమాజ పండుగగా భావించాలన్నారు. దేశ నిర్మాణంలో పౌరులు, కార్మికులు, రైతులు, మహిళలు, పీడిత వర్గాల హక్కుల పరిరక్షణలో అంబేద్కర్ గారి కృషి అపారమని కొనియాడారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలను బలోపేతం చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం కలిగేలా రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలతో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు.
టిటిడి సివిఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ మాట్లాడుతూ, అంబేద్కర్ అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజలను చైతన్య మార్గంలో నడిపించిన మహనీయుడని తెలిపారు. స్పష్టమైన ప్రణాళికతో దేశ ప్రజలకు దిశానిర్దేశం చేసిన నాయకుడని అభివర్ణించారు.
ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ ఎం. సతీష్ చందర్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా అంబేద్కర్ లాంటి రాజ్యాంగ శిల్పికి లభించిన గౌరవం మరెక్కడా లేదని అన్నారు. భారతదేశానికి స్థిరమైన వ్యవస్థను అందించి దేశ భవిష్యత్తును మలిచిన మహానుభావుడని కొనియాడారు.
మరో వక్తగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ డా. చింతకింది కాశీం మాట్లాడుతూ, దేశాన్ని లౌకికవాదం, సామ్యవాదం వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. నీటి హక్కులు, మహిళా విద్య, సామాజిక న్యాయం వంటి అంశాల్లో ఆయన పోరాటం ఆదర్శప్రాయమని చెప్పారు.
టిటిడి పాలక మండలి సభ్యురాలు శ్రీమతి పనబాక లక్ష్మీ మాట్లాడుతూ, అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లే తాను కేంద్రమంత్రిగా సేవ చేసే అవకాశం పొందానని చెప్పారు. యువత ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలన అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. విజయవాడ బృందం, కళారత్న శ్రీ రంగం రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
60 మంది ఉద్యోగులకు కమ్యూనల్ అవార్డులు ప్రదానం
ఈ సందర్భంగా టిటిడిలో విధులు నిర్వహిస్తున్న 60 మంది ఉద్యోగులకు డా. బి.ఆర్. అంబేద్కర్ కమ్యూనల్ అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహితలకు 5 గ్రాముల వెండి డాలర్తో పాటు అంబేద్కర్ చిత్రపటాన్ని అందించి ఘనంగా సన్మానించారు. క్విజ్, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులు, వక్తలను సన్మానించారు.
ఈ కార్యక్రమం డిప్యూటీ ఈవో (సంక్షేమం) శ్రీ ఏ. ఆనందరాజు ఆధ్వర్యంలో జరిగింది. టిటిడి సిపిఆర్వో డా. టి. రవి, ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
No comments :
Write comments