ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో దాదాపు 80 వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు.
టీటీడీకి చెందిన అన్ని విభాగాలు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఈ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
• కల్యాణ వేదిక ప్రాంగణంలో విశాలమైన 121 గ్యాలరీలను ఏర్పాటు చేసి, భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని కల్యాణోత్సవాన్ని వీక్షించేలా చర్యలు తీసుకున్నారు.
• కల్యాణానికి విచ్చేసిన ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణాలను టీటీడీ అందించింది.
• ప్రతి భక్తుడికి లెమన్ రైస్, కేసరి, బిస్కెట్ ప్యాకెట్, మ్యాంగో జ్యూస్, వాటర్ బాటిల్, స్వీట్, కారా పదార్థాలతో కూడిన కిట్ను అందజేశారు.
• గ్యాలరీలలో భక్తులకు శ్రీవారి సేవకులు నిరంతరం మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు.
• నడిచి వచ్చే భక్తుల కోసం 11 ప్రాంతాల్లో, ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేలా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశారు. పానకం, మజ్జిగ, చలివేంద్రాలు, వాటర్ కూలర్లు, సిబ్బంది అందుబాటులో ఉంచారు.
• శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు 21 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
• అలాగే ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కల్యాణ వేదిక వరకు టీటీడీ 20 ఉచిత బస్సులను నడిపింది.
• భక్తుల ఆరోగ్య పరిరక్షణకు 13 వైద్య శిబిరాలు, 35 మంది వైద్య నిపుణులు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 8 అంబులెన్సులు సిద్ధంగా ఉంచి అవసరమైన వైద్యసేవలు అందించారు.
• పారిశుద్ధ్య పరిరక్షణలో భాగంగా 250 మరుగుదొడ్లు ఏర్పాటు చేసి, 3,268 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించారు.
• సుమారు 2,600 మంది శ్రీవారి సేవకులు, ప్రభుత్వ, పోలీస్, టీటీడీ సిబ్బంది సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించారు.
No comments :
Write comments