తిరుమల
నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు రెండో రోజు వైభవంగా జరిగాయి.
శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో రెండో రోజైన వైశాఖశుద్ధ దశమి తిథి అలనాటి వివాహ సుముహూర్త దినమని పురాణ ప్రశస్తి.
కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవాల్లో రెండో రోజుకు ప్రత్యేకత ఉంది.
ఆదివారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి, వెంట వేరు వేరు బంగారు తిరుచ్చీలపై శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు.
మొదటిరోజు మాదిరే శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు జరిగింది. ఈ కొలువులో చతుర్వేద పారాయణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరులు భాగవతార్ హరికథ గానం భక్తులను అలరించింది.
ఆ తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయలోకి ప్రవేశం చేశారు.
ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments