తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల్లో వేదాల సారాంశం, భక్తి తత్త్వం సమన్వయమై ఉన్నాయని తిరుపతికి చెందిన డా|| జయమ్మ తెలిపారు. అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాల సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాహితీ సదస్సు భక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా డా|| జయమ్మ “అన్నమయ్య సంకీర్తనల్లో శ్రీరాముడు” అనే అంశంపై మాట్లాడుతూ, శరణాగతి తత్త్వం, లోకనీతి, వేద విజ్ఞాన సారం అన్నమయ్య సాహిత్యంలో ప్రతిఫలించాయని వివరించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి నామంలోనే సమస్త మంత్రాల సారం నిక్షిప్తమై ఉందని ఆమె పేర్కొన్నారు.
పుత్తూరుకు చెందిన డా|| నరసింహులు “అన్నమయ్య జీవితం – సందేశం” అనే అంశంపై మాట్లాడుతూ, అన్నమయ్య జీవితం భక్తి, సమానత్వం, మానవత్వానికి ప్రతీకమని తెలిపారు. ఆయన సంకీర్తనలు ప్రతి మనిషిని ధర్మమార్గంలో నడిపించే దివ్య మార్గదర్శకాలు అని పేర్కొన్నారు.
డా|| శైలేశ్వరి “అన్నమయ్య సంకీర్తనలు – సంగీతం” అనే అంశంపై మాట్లాడుతూ, అన్నమయ్య సులభమైన పదాలతో భక్తి సంగీతాన్ని ప్రజలకు చేరువ చేసి ఆధ్యాత్మికతను విస్తరింపజేశారని చెప్పారు. ఆయన సంకీర్తనలు నేటికీ ఆలయాల్లో మార్మోగుతూ భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. లత, పెద్ద సంఖ్యలో భక్తులు, సాహితీప్రియులు పాల్గొన్నారు.


No comments :
Write comments