తాళ్లపాక
అన్నమాచార్యుల సూక్తులు భక్తి, నీతి, మానవతా విలువలను ప్రజల్లో పెంపొందించే దివ్య సందేశాలని తిరుపతికి చెందిన డా. హేమంత్ కుమార్ తెలిపారు. అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం నిర్వహించిన సాహితీ సదస్సులు భక్తి వాతావరణంలో ఘనంగా ముగిశాయి.
“అన్నమయ్య సూక్తులు – జన జీవనం” అనే అంశంపై మాట్లాడిన డా. హేమంత్ కుమార్, అన్నమయ్య కీర్తనలు కేవలం భక్తి గీతాలు మాత్రమే కాకుండా మానవ జీవితానికి సన్మార్గం చూపే ఆధ్యాత్మిక సందేశాలని పేర్కొన్నారు. ఆయన రచనల్లో ధర్మం, నీతి, సత్యం, సమాజ సంస్కరణ వంటి విలువలు ప్రతిబింబించాయని చెప్పారు.
“తాళ్లపాక కవులు – తిరుమల కైంకర్యాలు” అనే అంశంపై తాళ్లపాక వంశీయులు శ్రీ హరినారాయణాచార్యులు మాట్లాడుతూ, అన్నమయ్య మరియు వారి వంశస్థులు జీవితాంతం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవకే అంకితమయ్యారని తెలిపారు. సంకీర్తనల ద్వారా శ్రీనివాసుని మహిమను ప్రపంచానికి చాటిచెప్పారని వివరించారు.
“అన్నమయ్య సంకీర్తనలు – ఆధ్యాత్మికత” అనే అంశంపై డా. వాసుదేవ రావు మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలు ప్రజలను భక్తి, వైరాగ్యం, మోక్ష మార్గం వైపు నడిపించే దివ్య గానమని చెప్పారు. భక్తి ద్వారా వేదాంతాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేసిన మహనీయుడు అన్నమయ్య అని కొనియాడారు.
సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా. మేడసాని మోహన్, సంచాలకులు శ్రీమతి లత, పెద్ద సంఖ్యలో భక్తులు, సాహితీప్రియులు పాల్గొన్నారు.
No comments :
Write comments