జమ్మలమడుగు
శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం నిర్వహించిన రథోత్సవం వైభవంగా సాగింది. ఉదయం 07.30 గంటలకు వృషభలగ్నంలో స్వామివారు రథారోహణం చేసి, అనంతరం ఉదయం 08.30 గంటలకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.
మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణ, భజనలు, కోలాటాల నడుమ సాగిన రథోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పరవశులయ్యారు.
రథోత్సవానికి ఉన్న తాత్త్విక ప్రాధాన్యాన్ని పండితులు వివరించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులనే భావన ద్వారా ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని తెలిపారు. రథోత్సవం భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే మహోత్సవమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాత్రి 07.00 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు ఆలయ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments