నాగలాపురంలోని
శ్రీ వేద నారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు వైకుంఠనాధుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు.
శంఖు, చక్రం, గదాధారిగా వెలుగొందిన స్వామివారి దివ్యరూపం భక్తులను ఆహ్లాదపరిచింది.
భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, వివిధ కళా ప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా, రమణీయంగా జరిగింది. చిన్నశేష వాహనాన్ని దర్శించిన భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలినీయోగ సిద్ధి లభిస్తుందని శాస్త్రోక్తంగా విశ్వసిస్తున్నారు.
అనంతరం ఉదయం 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేద నారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేష అభిషేకాలు నిర్వహించగా భక్తులు దివ్యానుభూతిని పొందారు.
ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ధర్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, శ్రీ చెంగల్రాయులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments