నాగలాపురం
శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన సోమవారం రాత్రి, సర్వభూపాల వాహనంపై శ్రీ వరదరాజస్వామి అలంకారంలో స్వామివారు అద్భుతంగా విరాజిల్లుతూ భక్తులను కటాక్షించారు.
వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని స్తుతిస్తూ సాగగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ ఆధ్యాత్మిక ఉత్సాహంతో కోలాహలంగా జరిగింది. మార్గమంతా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకుని పుణ్యఫలాన్ని పొందారు.
“సర్వభూపాలులు” అంటే సమస్త రాజులు. “రాజా ప్రజారంజనాత్” అన్న న్యాయానికి అనుగుణంగా ప్రజలను రంజింపజేసే వారే నిజమైన రాజులు. అలాంటి రాజులందరికీ పరమాధిపతి భగవంతుడే అన్న భావాన్ని ఈ వాహనసేవ ప్రతిబింబించింది.
మే 05న మంగళవారం ఉదయం 8 గంటలకు మోహిని అలంకారంలో పల్లకిపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8 గంటలకు విశేష గరుడ వాహనంపై శ్రీవారు భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులు, శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు పాల్గొనగా, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
No comments :
Write comments