అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది జూన్ 25 నుండి జూలై 3వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఉత్సవాలకు ముందుగా జూన్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూన్ 24న సాయంత్రం అంకురార్పణ ఘనంగా జరగనున్నాయి.
వాహనసేవల్లో భక్తులకు దివ్య దర్శన భాగ్యం
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు వివిధ దివ్య వాహనాలపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
వాహనసేవల విశేషాలు
జూన్ 25 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం
జూన్ 26 – చిన్నశేష వాహనం, హంస వాహనం
జూన్ 27 – సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం
జూన్ 28 – కల్పవృక్ష వాహనం, కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
జూన్ 29 – మోహినీ అవతారం, గరుడ వాహనం
జూన్ 30 – హనుమంత వాహనం, గజ వాహనం
జూలై 1 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
జూలై 2 – రథోత్సవం, అశ్వవాహనం
జూలై 3 – చక్రస్నానం, ధ్వజావరోహణం
జూన్ 28న స్వామివారి కల్యాణోత్సవం
జూన్ 28వ తేదీ సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేయనున్నారు.
ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ మ్యూజిక్ కళాశాలల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, భజనలు, కోలాటాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తనున్నారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని టిటిడి కోరుతోంది.
No comments :
Write comments