కార్వేటినగరం
శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అలరించారు.ఉదయం 7.30 గంటలకు పల్లకిపై గ్రామ వీధుల్లో విహరించిన స్వామివారు భక్తులను కటాక్షించారు. వాహనసేవకు ముందుగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో భక్తిరసాన్ని పంచగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది.
అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణలతో స్వామివారిని దర్శించుకున్నారు.
మాయపై విజయం సాధించే సందేశమే మోహినీ అవతారం అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీమహావిష్ణువు ధరించిన మోహినీ అవతారాన్ని పురాణాలు విశదీకరిస్తున్నాయి. మోహినీ అలంకారంలో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా మాయను అధిగమించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఈ అవతారం సందేశం ఇస్తుంది.
నేడు రాత్రి గరుడవాహనంపై దివ్య దర్శనం
బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ బుధవారం రాత్రి 7 గంటల నుండి జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారు గరుడునిపై భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.
వాహనసేవలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments