తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ rush
వేసవి రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొనడంతో భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు బాటగంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ పనులు, అదనపు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టారు. ఇదే సమయంలో నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయడం ద్వారా భక్తులు నేల వేడి నుండి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు. బాట గంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
టీటీడీ అన్న ప్రసాద విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకుల ద్వారా క్యూలైన్లలోని భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఉదయం అల్పాహారంగా పాలు ఉప్మా, పొంగల్, మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమోట రైస్, రాత్రి పాలు ఉప్మా, సాంబారన్నం భక్తులకు నిరంతరాయంగా పంపిణీ చేయడం జరుగుతోంది.
అదేవిధంగా టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో ఎప్పటికప్పుడు తాగునీరు పంపిణీ చేయడం జరుగుతోంది.
రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డులో క్యూలైన్ల వెంబడి ఒక మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అందుబాటులో ఉంచడం జరిగింది.
తిరుమలలో పరిమిత సంఖ్యలో వసతి గదులు నిర్మిచబడ్డాయి. దీంతో 60వేల మంది భక్తులకు మించి తిరుమలలో వసతి కేటాయించడానికి వీలుపడదు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7500 గదులు, ఐదు యాత్రికుల వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. గదులు పొందలేని భక్తులు తిరుమలలోని పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ (పద్మనాభ నిలయం), పీఏసీ-5 లలో ఉన్న దాదాపు తొమ్మిదివేల లాకర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి.
తిరుమలలో భక్తులు స్వామివారికి తలనీలాల సమర్పణ కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో ప్రధాన కల్యాణకట్టతో 11 మినీ కల్యాణ కట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. నిరంతరాయంగా క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు.
గత ఐదు రోజుల్లోనే 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. ఇందులో అత్యధికంగా మే 16, 17వ తారీఖుల్లో 90 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా గత ఐదురోజుల్లో తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అత్యధికంగా మే 18, 19, 20వ తారీఖుల్లో 43 వేలకు పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం విశేషం. అదేవిధంగా గత ఐదురోజుల్లో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 19 లక్షలకు పైగా భక్తులకు అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ అందించడం జరిగింది.
వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు నీడ, చల్లని వాతావరణం, తాగునీరు, అన్న ప్రసాదాలు, పరిశుభ్రత, వసతి, తలనీలాల సమర్పణ, లడ్డూలు వంటి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందించడం కోసం టీటీడీ యంత్రాంగం విశేష కృషి చేస్తోంది.
గత ఐదు రోజుల్లో నమోదైన భక్తుల రద్దీ గణాంకాలు (సంఖ్యల్లో)
------------------------------
తేది - దర్శనాలు - తలనీలాలు - అన్న ప్రసాదాలు
------ ------------- ---------- ------------------
మే 20 - 86,315 - 44,107 - 3,99,380
మే 19 - 84,412 - 43,032 - 4,03,810
మే 18 - 80,455 - 43,309 - 3,42,670
మే 17 - 91,020 - 35,193 - 3,81,210
మే 16 - 90,011 - 39,083 - 4,20,085
కాగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది దర్శన క్యూలైన్లు, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ రాత్రింబవళ్లు
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా
శ్రమిస్తున్నారు.



.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)