తిరుమల
శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు టీటీడీ, తిరుపతి జిల్లా యంత్రాంగం, పోలీసు తదితర అన్ని శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ తదితర అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టిటిడి అదనపు ఈవో మంగళవారం తిరుపతిలో పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో భక్తులు సౌకర్యవంతంగా స్వామివారి వాహనసేవలను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాలు, ప్రజా రవాణా వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీ, పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, టీటీడీ, పోలీసు, మున్సిపల్, రవాణా, ఆరోగ్య తదితర శాఖలు ఒకే బృందంగా పనిచేసేలా కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.
గత బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, అదనపు ఏర్పాట్లు చేపట్టామని, భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారంపై తక్షణమే స్పందించేలా ప్రత్యేక రెస్పాన్సివ్ టీమ్, అలాగే విపత్తు నిర్వహణ, అత్యవసర స్పందన బృందాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, టీటీడీ సమన్వయంతో రానున్న బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమష్టిగా కృషి చేస్తాయని ఆయన వివరించారు.
భక్తుల కోసం హోల్డింగ్ పాయింట్లు, స్క్రీన్ల ఏర్పాటు - జిల్లా కలెక్టర్
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వేంకటేశ్వర్ మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో భక్తుల కోసం పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి, తిరుమలలో రద్దీకి అనుగుణంగా భక్తులను నియంత్రించనున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్ల ద్వారా స్వామివారి వాహనసేవలను భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు.
టీటీడీతో నిరంతర సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు.
కెమెరాలు, డ్రోన్లతో సమగ్ర నిఘా - జిల్లా ఎస్పీ
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల విజయవంతమైన నిర్వహణకు టీటీడీ, పోలీసు, రెవెన్యూ, జిల్లా యంత్రాంగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో పార్కింగ్ పరిమితుల దృష్ట్యా తిరుపతిలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాలు కల్పించి, అక్కడి నుంచి భక్తుల రవాణాకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా రైల్వే స్టేషన్, బస్స్టాండ్, అలిపిరి, శ్రీవారిమెట్టు తదితర కీలక ప్రాంతాలను తిరుపతి కమాండ్ కంట్రోల్ ద్వారా కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. తిరుమలలో ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు సుమారు 3,000 కెమెరాల ద్వారా భక్తుల రద్దీ, భద్రతను పర్యవేక్షించనున్నట్లు వివరించారు.
భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు - టిటిడి సివిఎస్వో
టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్, రవాణా, భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసు సిబ్బందితో పాటు ఆర్టీసీ సేవలను సమన్వయం చేసి భక్తులకు మెరుగైన సేవలు అందించనున్నట్లు చెప్పారు.
అలిపిరి టోల్గేట్, అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో భద్రత, స్క్రీనింగ్ను మరింత పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. అలిపిరిలో ఏర్పాటు చేసిన ANPR, FRS కెమెరాలను తిరుమల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశామని, డేటాబేస్లోని సుమారు 1,500 మంది నేరస్థులను గుర్తించేలా వ్యవస్థను సిద్ధం చేసినట్లు వివరించారు. తిరుమల, తిరుపతిలోని కమాండ్ కంట్రోల్, సబ్ కంట్రోల్ కేంద్రాలను అనుసంధానించి వాహనాల రాకపోకలు, పార్కింగ్ సామర్థ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుపతిలో పార్కింగ్, ట్రాఫిక్, రవాణా తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఏర్పాట్లను వివరించారు.
అనంతరం దేవలోక్, భారతీ విద్యా భవన్, అలిపిరి చెక్పాయింట్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పార్కింగ్, హోల్డింగ్ పాయింట్ల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవోలు డా. ఎ. శరత్, శ్రీ పి. గోపినాథ్, సీఈ శ్రీ మహనోరం, విజీవో శ్రీ గిరిధర తదితర అధికారులు పాల్గొన్నారు.