తిరుపతిలోని
అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.ఈ సదస్సులో శ్రీ రామానుజాచార్యులు, ఆచార్య పుండరీకాక్షులు, శ్రీ గోవింద భట్టర్ (ఎంబార్), శ్రీ దాశరథి (ముదళియాండాన్) వారి జీవితం, ఆధ్యాత్మిక సేవలు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారం, ఆలయ ఆచార–సంప్రదాయాల పరిరక్షణలో వారు చేసిన విశిష్ట కృషిపై పరిశోధనాత్మక చర్చలు జరుగనున్నాయి.
నాలుగు రాష్ట్రాల నుంచి 25 మంది పరిశోధకులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 25 మంది పరిశోధకులు, పలువురు పండితులు ఈ సదస్సులో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయ వికాసంలో ఆచార్యుల పాత్ర, వారి ఆధ్యాత్మిక సేవలు, దివ్యప్రబంధ ప్రచారం తదితర అంశాలపై లోతైన చర్చలు నిర్వహించనున్నారు.
జీయర్ స్వామివార్ల మంగళాశాసనాలతో ప్రారంభం
ఆగస్టు 17న ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామివారు, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో సదస్సు ప్రారంభమవుతుంది.
ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు సదస్సు కొనసాగుతుంది.
శ్రీ వైష్ణవ సంప్రదాయ వైభవాన్ని చాటే సదస్సు
శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారం, దివ్యప్రబంధ పారాయణం, ఆలయ ఆచార–సంప్రదాయాల పరిరక్షణలో వారి అమూల్య కృషిని ఈ సదస్సు ద్వారా నేటి తరానికి పరిచయం చేయనున్నారు. భక్తి, ఆధ్యాత్మికత, పరిశోధనలను సమన్వయం చేస్తూ శ్రీ వైష్ణవ సంప్రదాయ వైభవాన్ని మరింతగా వెలుగులోకి తీసుకురావడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం.