Showing posts with label Bhagavad Geetha. Show all posts
Showing posts with label Bhagavad Geetha. Show all posts

1.12.21

కర్మ, అకర్మ మరియు వికర్మ గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు!

   

కర్మ, అకర్మ మరియు వికర్మ గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (01 - 06 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 01 నుండి 06 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/7xnctA7uUDA ]

ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు కర్మల స్వభావాన్ని విశదీకరిస్తున్నాడు. కర్మ, అకర్మ మరియు వికర్మ అనబడే మూడు సూత్రాలను గురించి, చెప్పబోతున్నాడు.

శ్రీ భగవానువాచ ।
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ ।
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ।। 1 ।।

శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు: నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును, సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకీ, మనువు ఇక్ష్వాకునికీ, దీనిని ఉపదేశించాడు.

అమూల్యమైన, వెలకట్టలేని జ్ఞానాన్ని ఎవరికైనా, చెపితే సరిపోదు. ఆ జ్ఞానాన్ని అందుకున్నవారు, దాని విలువను తెలుసుకుని, గౌరవించి, ఆ జ్ఞానం యొక్క ప్రామాణికత మీద విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే, వారు తమ జీవిత నడవడికలో, దానిని ఆచరించటానికి కావలసిన శ్రమ చేస్తారు. అర్జునుడికి తాను ఉపదేశించే ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క విశ్వసనీయతనూ, ప్రాముఖ్యతనీ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు స్థిరపరుస్తున్నాడు. తాను ఉపదేశించే ఈ జ్ఞానం, కేవలం, ఆర్జునుడిని యుద్ధం కోసం ప్రేరేపించే సౌలభ్యం కోసం, ఇప్పటికిప్పుడు పుట్టించినది కాదనీ, సృష్టి ఆరంభం నుండే ఉందనీ, అర్జునుడికి వివరిస్తున్నాడు. శ్రీ కృష్ణుడు మొట్టమొదటగా, వివస్వానుడికి, అంటే, సూర్య భగవానుడికి ఈ యోగ శాస్తాన్ని, బోధించాడు. అతను మానవ జాతికి మూలపురుషుడైన మనువుకీ; మనువు దానిని సూర్య వంశ ప్రథమ రాజైన ఇక్ష్వాకుడికీ, బోధించాడు.

ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః ।
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ।। 2 ।।

ఓ శత్రువులను జయించేవాడా, ఈ విధముగా, పరంపరాప్రాప్తమైన ఈ యోగ శాస్త్రము, రాజర్షులకు తెలిసింది. కానీ, కాలగమనంలో అది లుప్తమైపోయినది.

దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అవరోహణ క్రమంలో అందుకునేటప్పుడు, శిష్యుడు భగవత్-ప్రాప్తిని తెలిపే శాస్త్రాన్ని, గురువు గారి నుండి అర్థంచేసుకుంటాడు. ఆ గురువు, తన గురువు నుండి ఇలాగే అందుకుంటాడు. ఈ విధమైన సాంప్రదాయంలోనే రాజర్షులైన నిమీ, జనకుడూ, యోగ శాస్త్రాన్ని అర్థం చేసుకున్నారు. భగవంతుడు, సృష్టి ప్రారంభంలో ఈ జ్ఞానాన్ని, ప్రప్రధమంగా జన్మించిన బ్రహ్మ దేవుని హృదయంలో, తెలియపరిచాడు. ఆయన నుండి ఈ సంప్రదాయం, కొనసాగింది. కానీ, ఈ భౌతిక ప్రపంచ స్వభావం వలన, కాల క్రమంలో, ఈ జ్ఞానం క్షీణించిపోయింది. ప్రాపంచిక మనస్తత్వం కలిగిన కపటులైన శిష్యులు, తమ కళంకిత దృక్పథంతో, బోధనలను అన్వయిస్తుంటారు. కొద్ది తరాల్లోనే, ఆ జ్ఞానం యొక్క శక్తి మలినమైపోతుంది. ఇలా జరిగినప్పుడు, తన అకారణ కరుణచే, భగవంతుడు ఆ సందేశాన్ని మానవ జాతి సంక్షేమం కోసం, తిరిగి సుస్థిరపరుస్తుంటాడు. ఆ పనిని, తానే ఈ లోకంలో అవతరించి గానీ, లేదా తన పని కోసమే నియమింపబడ్డ భగవత్ ప్రాప్తి నొందిన మహనీయుని ద్వారా గానీ, చేస్తాడు.

స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః ।
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ।। 3 ।।

అదే ప్రాచీనమైన, పరమ రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును, నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే, నీవు నా మిత్రుడవు, మరియు భక్తుడవు. ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు.

ఏదైనా విషయాన్ని ఈ లోకంలో రహస్యంగా ఉంచడానికి, రెండు కారణాలుంటాయి. ఒకటి, రహస్యం తనకే తెలియాలనే స్వార్థం, రెండోది, ఆ విషయాన్ని దుర్వినియోగం కాకుండా, కాపాడడం కోసం. ఈ యోగ విద్య ఒక రహస్యంగా ఉండటానికి, ఈ రెండు కారణాలూ కాక, వేరే కారణం ఉంది. అదేమిటంటే, దీనిని అర్థం చేసుకోవడటానికి, ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతే, 'భక్తి'. భగవద్గీత యొక్క నిగూఢమైన సందేశాన్ని, కేవలం పాండిత్యంతోనో, లేదా సంస్కృత భాషపై పట్టుతోనో అర్థం చేసుకోవటానికి, కుదరదు. దీనికి భక్తి అవసరం. ఇది జీవాత్మకు భగవంతుని పట్ల ఉండే సూక్ష్మమైన అసూయని నిర్మూలించి, ఆయన అణు-అంశలుగా, ఆయన సేవకులుగా, మనల్ని మనం పరిగణించుకునేలా చేస్తుంది. అర్జునుడు ఈ విద్యను నేర్చుకోవటానికి తగిన విద్యార్థి. ఎందుకంటే, అతను భగవంతుని భక్తుడు. అర్జునుడు భగవంతుడిని, తన మిత్రునిగా ఆరాధించాడు. కాబట్టి, శ్రీ కృష్ణుడు అతనితో మిత్రునిగా, భక్తుడిగా సంభాషిస్తున్నాడు. భక్తి నిండిన హృదయం లేకుండా, భగవద్గీత యొక్క సందేశాన్ని, వాస్తవరూపంలో అర్థం చేసుకోవడం, అసాధ్యం.

అర్జున ఉవాచ ।
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః ।
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ।। 4 ।।

అర్జునుడు ఇలా అంటున్నాడు: నీవు వివస్వనుడి తరువాత ఏంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యను అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావంటే, నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

శ్రీ కృష్ణుడి మాటలతో, అర్జునుడు కొంత అయోమయానికి గురయ్యాడు. సూర్య భగవానుడు, సృష్టి ప్రారంభం నుండీ ఉన్నాడు. కానీ, శ్రీ కృష్ణుడు ద్వాపర యుగంలో పుట్టాడు. ఒకవేళ శ్రీ కృష్ణుడు దేవకీవసుదేవుల తనయుడైతే, ఈ యోగ విద్యని, సూర్య భగవానుడికి ఎలా చెప్పాడనే విషయంపై, అర్జునుడి సంశయం మొదలైంది. అందుకే ఇలా అడుగుతున్నాడు.

శ్రీ భగవానువాచ ।
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ।
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ।। 5 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ పరంతపా! మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. ఓ అర్జునా, నీవు వాటిని మరచిపోయావు. కానీ, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి.

భగవంతుడు లోక కళ్యాణం కోసం, ఒక్కోసారి ఈ భౌతిక ప్రపంచంలో అవతరిస్తూ ఉంటాడు. కానీ, అతని దైవిక గుణాలూ, దివ్య శక్తులూ ఏమాత్రం తగ్గవు. జీవాత్మకీ, పరమాత్మ అయిన భగవంతునికీ, చాలా పోలికలున్నాయి. రెండూ సత్-చిత్-ఆనందములే. కానీ ఎన్నో తేడాలు కూడా ఉన్నాయి. భగవంతుడు సర్వ వ్యాపి. జీవాత్మ, తానున్న శరీరంలోనే వ్యాపించి ఉంటుంది.. భగవంతుడు సర్వశక్తివంతుడు. కానీ జీవాత్మకి, తనను తాను మాయా మొహం నుండి కూడా, భగవంతుని కృప లేకుండా, విడిపించుకునే శక్తి లేదు.. భగవంతుడు, ఈ ప్రకృతి నియమాలను సృష్టించిన వాడు. ఆత్మ ఈ నియమాలకు బద్దుడై ఉంటుంది.. సమస్త సృష్టినీ నిర్వహించేవాడు భగవంతుడు. జీవాత్మ కూడా, అతనిచేతనే నిర్వహింపబడుతుంది.. భగవంతుడు సర్వజ్ఞుడు. కానీ జీవాత్మ, ఒక్క విషయంపై కూడా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండదు. జీవాత్మకీ, పరమాత్మకీ చాలా తారతమ్యం ఉంటుంది.

అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ।। 6 ।।

నేను పుట్టుకలేని వాడనూ, సమస్త ప్రాణులకూ ప్రభువునూ, నాశములేని వాడినై ఉండి కూడా, ఈ లోకంలో నేను, నా దివ్య శక్తి యోగమాయచే కనిపిస్తుంటాను.

భగవంతుడు ఒక రూపం కలిగి ఉంటాడన్న అభిప్రాయాన్ని, చాలా మందిఒప్పుకోరు. వారు, నిరాకార, సర్వ వ్యాపి, అశరీర, సూక్ష్మ భగవంతుని యందే నమ్మకాన్ని, కలిగి ఉంటారు. భగవంతుడు కచ్చితంగా ఆశరీరుడు, నిరాకారుడే కానీ, అంతమాత్రాన, ఆయన అదే సమయంలో, ఒక రూపము తీసుకోలేడని కాదు. భగవంతుడు సర్వ శక్తివంతుడు కాబట్టి, ఆయనకి తన సంకల్పంచే, ఒక స్వరూపంతో వ్యక్తమయ్యే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి, "భగవంతుడు నిరాకారుడు" అనేది, అసంపూర్ణ ప్రతిపాదన. అదే విధంగా, "భగవంతుడు ఒక సాకార రూపంలోనే అవతరిస్తాడు" అంటే, అది కూడా పాక్షిక వాస్తవమే అవుతుంది. సర్వ శక్తివంతుడైన పరమాత్మ యొక్క దివ్యమైన వ్యక్తిత్వానికి, రెండు అస్థిత్వాలున్నాయి - వ్యక్తిగత స్వరూపం, మరియు నిరాకార అస్తిత్వం. నిజానికి, జీవాత్మకి కూడా, తన అస్థిత్వానికి రెండు కోణాలుంటాయి. అది నిరాకారం కాబట్టి, శరీరాన్ని, మరణ సమయంలో విడిచిపెట్టినప్పుడు, కనిపించదు. అదేవిధంగా, అది శరీరాన్ని కూడా స్వీకరిస్తుంది - ఒక సారి కాదు. అసంఖ్యాకమైన సార్లు - ఒక జన్మ నుండి ఇంకో జన్మకు దేహాంతరమవుతూ, మారుతూ ఉంటుంది. సూక్షమైన ఆత్మకే, ఒక శరీరం స్వీకరించగలిగే శక్తి ఉన్నప్పుడు, సర్వ శక్తిమంతుడైన భగవంతునికి కూడా, ఆ శక్తి ఉంటుందనేది, అందరూ అంగీకరించాల్సిన సత్యం.

ఇక మన తదుపరి వీడియోలో, జీవన్మరణాలలో జీవాత్మ తిరుగుతూ ఉండకుండా, శాశ్వత మోక్షాన్ని ఏ విధంగా పొందాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

18.11.21

మనిషిలోని కామము గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు!

   

మనిషిలోని కామము గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (35 - 39 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 35 నుండి 39 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/Lx_inSfGdwQ ]

స్వధర్మ నిర్వహణ గురించి, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 35 ।।

ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే, అత్యుత్తమం. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గాన్ని అనుసరించటం, ప్రమాదకరమైనది.

జీవాత్మ యొక్క ధర్మం, భగవంతుణ్ణి ప్రేమించడమే. అదే, మన అస్థిత్వానికి ఉన్న మూల సూత్రం. మన వ్యక్తిగత ధర్మం, మనకున్న ప్రస్తుత జీవనంలోని సందర్భం, పరిస్థితీ, పరిపక్వతా, మరియు వృత్తిని బట్టి ఉంటుంది. జీవన శైలి మారినప్పుడూ, ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడూ, ధర్మం అనేది మారుతుంది. అందుకే, తన వృత్తి ధర్మాన్ని చేయమని, అర్జునుడికి బోధిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను, మానసిక స్థైర్యముతో, చాలా సునాయాసంగా చేయవచ్చు. కానీ, ఇతరుల విధులు చూడడానికి ఆకర్షణీయంగా అనిపించినా, అది ప్రమాదకరమైనది. వారి ధర్మం, మన స్వభావంతో పొసగకపోతే, అది మన ఇంద్రియమనోబుద్ధులలో ఘర్షణకు దారితీస్తుంది. అంతేకాకుండా, మన అంత:కరణానికి హాని కలిగించి, ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకి అవుతుంది. అసహజమైన పరుల ధర్మములు చేయడం కన్నా, స్వంత ధర్మములు నిష్ఠగా చేయడంలో, మరణించినా ఉత్తమమే అన్న సందేశాన్నిస్తున్నాడు, భగవానుడు.

అర్జున ఉవాచ ।
అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః ।
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ।। 36 ।।

అర్జునుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఓ వృష్ణి వంశీయుడైన శ్రీ కృష్ణా, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా, బలవంతంగా, ఏదోశక్తి చేయించినట్టు, పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడుతున్నాడు?

అర్జునుడు శ్రీ కృష్ణుడిని, మానవ సంఘర్షణను సూచించే ఒక వాస్తవిక సందేహాన్ని అడిగాడు. పాపపు పనులు చేసేటప్పుడు, మనందరికీ, ఇది తప్పు అనే భావననో, లేదా పశ్చాత్తాపాన్నో కలిగించే ఒక మనఃసాక్షి ఉంటుంది. భగవంతుడు సర్వ సుగుణములకూ నిలయమన్న నిజం మీద, మనఃసాక్షి స్థితమై ఉంటుంది. ఆయన అంశ అయినటువంటి మనకు, సుగుణములకూ, మంచితనానికీ ఆకర్షితమయ్యే సహజ స్వభావం ఉంటుంది. జీవాత్మకు సహజ స్వభావంగా ఉన్న మంచితనము, మనఃసాక్షికి స్వరాన్నిస్తుంది. కాబట్టి, దొంగతనం చేయటం, మోసం చేయటం, దూషించటం, లాక్కోవటం, హత్య చేయటం, హింసించటం మరియు అవినీతి వంటివి, తప్పు అని తెలియజేస్తుంది. సహజ జ్ఞానం ద్వారా ఇవి పాపిష్టి పనులని మనకు తెలిసినా, ఎదో ఒక బలీయమైన శక్తి ప్రేరేపించినట్టుగా, మనం ఈ పనులు చేస్తుంటాము. ఆ బలీయమైన శక్తి ఏమిటో, అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. అందుకే, దానికి సమాధానం చెప్పమని, శ్రీ కృష్ణుడిని అడుగుతున్నాడు.

శ్రీ భగవానువాచ ।
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముధ్భవః ।
మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్ ।। 37 ।।

భగవానుడు ఇలా సమాధానమిస్తున్నాడు: రజో గుణము నుండి ఉత్పన్నమయ్యే కామము, అంటే కోరికలూ, వాంఛలే, తదుపరి క్రోధముగా పరిణామం చెందుతాయి. దీనిని, లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దానిగా తెలుసుకొనుము.

వేదములలో, కామము అన్న పదాన్ని, కేవలం లైంగిక వాంఛల కోసమే కాక, మనం ఈ శరీరమే అన్న దృక్పథంలో ఉన్న అన్ని భౌతిక కోరికలనూ ఉద్దేశించి, వాడబడుతుంది. ఈ విధంగా, కామము ఎన్నో రకాలుగా బహిర్గతమవుతుంది. డబ్బుల కోసం యావా, వస్తువుల కోసం ఆశా, కీర్తి-ప్రతిష్ఠలపై కోరికా, అధికారం కోసం తపనా మొదలగునవి.. ప్రతి యొక్క ప్రాణికీ, స్వ-సహజంగా ఉండే భగవంతుని యందు ప్రేమ వక్రదారిలో పరావర్తనమైనప్పుడు, అది కామంగా మారుతుంది. ఎప్పుడైతే జీవాత్మ, ఈ శరీరమనే భౌతిక శక్తితో అనుసంధానం అవుతుందో, ఆత్మ యొక్క భగవంతునిపై ప్రేమ, రజో గుణ సాంగత్యం కారణంగా, 'కామము' గా మారుతుంది. దివ్య ప్రేమ అనేది, భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. కాబట్టి, భౌతిక ప్రపంచంలో దాని యొక్క వక్రమైన పరివర్తన, అంటే, కామము కూడా ప్రాపంచిక కార్యాలలో అత్యంత శక్తివంతమైనది.

ప్రాపంచిక వస్తువులు తృప్తినీ, ఆనందాన్నీ ఇస్తాయని నమ్మించి, రజో గుణము, ఆత్మను ప్రలోభానికి గురిచేస్తుంది. దాంతో వాటిని పొందటానికి మనిషి, ఆశ పడతాడు. కామమూ, లోభమూ మరియు క్రోధమూ అనబడే ఈ మూడింటి ప్రభావంచేత, మనిషి పాపాలు చేస్తాడు. అందుకే శ్రీ కృష్ణుడు, కామమే అన్ని అరిష్టాలకూ మూల కారణం అని అంటున్నాడు.

ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ ।
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।। 38 ।।

నిప్పు పొగచే కప్పబడినట్టుగా, దుమ్ముచే అద్దం మసకబారినట్టుగా, గర్భాయశముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడినట్టుగా,  ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామముచే కమ్మివేయబడుతుంది.

ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే, విచక్షణ అంటారు. ఈ విచక్షణ, మన బుద్ధిలో ఉంటుంది. కానీ, కామమనేది ఎంత బలమైన శత్రువంటే, అది బుద్ధి యొక్క విచక్షణా శక్తిని కప్పివేస్తుంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని వివరించటానికి, మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు. వెలుగు నిచ్చే అగ్ని, పొగచే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత, సాత్విక కోరికల వలన జనించే, పలుచని మబ్బు లాంటిది. ఒక అద్దం, సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది. కానీ దుమ్ముచే మాసిపోతుంది. ఈ యొక్క అపారదర్శకత అనేది, బుద్ధిపై రజోగుణ కోరికలు కలుగచేసే ముసుగు వంటిది, మరియు, గర్భము యందు భ్రూణము వలె పూర్తిగా దాచి ఉంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది, తామసిక కోరికలు, విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా, మన కోరికల స్థాయిని బట్టి, మనం విన్న, చదివిన, ఆధ్యాత్మిక జ్ఞానం, మరుగున పడిపోతుంది.

ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా ।
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ।। 39 ।।

ఓ కుంతీ పుత్రుడా, అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా, కోరికల రూపంలో ఉన్న శత్రువుచే, కప్పివేయబడుతుంది. ఇది ఎప్పటికీ తృప్తిపరచలేనిది, అగ్నిలాగా మండుతూనే ఉంటుంది.

ఈ శ్లోకంలో కామము అంటే, "కోరిక". దుష్పూరేణ అంటే, "తనివితీరనివి", అనల అంటే, "ఎన్నటికీ చల్లారనిది", అనే పదాలున్నాయి. ఇవి ఎంతో ప్రభావితమైనవి. కోరిక అనేది జ్ఞానుల విచక్షణా శక్తిని వశపరుచుకుని, దానిని తీర్చటానికి ఆశచూపుతుంది. కానీ, ఆ మంటని ఆర్పడానికి ఎంత ప్రయత్నిస్తే, అది అంత ఉధృతితో మండుతుంది. కోరిక అనేది, ఆర్పలేని అగ్నిలాగా మండుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ, ఎవ్వరికీ, సుఖాన్నివ్వలేదు. దానిని ‘దుఃఖానికి మూల హేతువు’ అని తెలుసుకుని త్యజించేవారు, వివేకవంతులు. కానీ, ఈ జ్ఞాన రహస్యాన్ని అర్థం చేసుకోలేనివారు, రజోగుణ కారణమైన కోరికలను తీర్చుకోవటానికే, ప్రయత్నిస్తుంటారు. ప్రాపంచిక విషయాల కోసం, వృధా ప్రయాసతో, తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు.

ఇక మన తదుపరి వీడియోలో, దు:ఖహేతువైన కామమును ఎలా నిర్మూలించాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

21.10.21

సృష్టి చక్రం గురించి శ్రీ కృష్ణుడు చెప్పిన అద్భుతాలు! Bhagavad Geetha

   

సృష్టి చక్రం గురించి శ్రీ కృష్ణుడు చెప్పిన అద్భుతాలు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (15 - 19 శ్లోకాలు)! - భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 15 నుండి 19 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/MNnc9zKzoa4 ]

సృష్టి చక్రం గురించి శ్రీ కృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు..

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముధ్భవమ్ ।
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ।। 15 ।।

మానవుల విహిత కర్మలు, వేదములలో చెప్పబడ్డాయి. మరియు, వేదములు ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి, సర్వ వ్యాపి అయిన భగవంతుడు, నిత్యమూ యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు.

వేదములు భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి. ఈ సనాతనమైన వేదములలో, మనుష్యుల విధులను, ఆ భగవంతుడే స్వయంగా వివరించాడు. ఈ విధులు ఏ విధంగా తయారుచేయ బడ్డాయంటే, వాటిని నిర్వర్తించడం ద్వారా, ప్రాపంచికంగా కూరుకుపోయిన మనుష్యులు, నెమ్మదిగా తమ వాంఛలను నియంత్రణ చేసుకుని, తమని తాము తమో గుణం నుండి రజో గుణానికీ, రజో గుణం నుండి సత్వ గుణానికీ ఉద్ధరించుకోవటం, నేర్చుకోవచ్చు. ఈ విధులు యజ్ఞంలాగా, ఆయనకే అంకితం చేయడానికి నిర్దేశింపబడ్డాయి. కాబట్టి, భగవంతుని అర్పితముగా, పవిత్రం చేయబడిన విధులు, దైవికంగా, భగవత్ సంబంధముగా ఉండి, భగవంతునితో అభేదంగా ఉంటాయి.

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః ।
అఘాయురింద్రియారామ: మోఘం పార్థ స జీవతి ।। 16 ।।

వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞ చక్రములో, తమ బాధ్యతలను నెరవేర్చని వారు, పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే, జీవిస్తారు. అట్టి వారి జీవితము, వ్యర్థము.

ఇక్కడ చక్రం అంటే, ఒక సృష్టి క్రమంలో జరిగే క్రమబద్ధ పరిణామాలు. ఈ విశ్వం అనే చక్రంలో, అందరు సభ్యులూ తమ విధులను నిర్వర్తించి, దాని యొక్క చక్కటి పరిభ్రమణానికి దోహదపడతారు. మనము కూడా ప్రకృతి చక్రం నుండి కావలసిన వాటిని తీసుకుంటాము కాబట్టి, మనము కూడా, మనకు నిర్దేశించబడిన విధులు, నిర్వర్తించాలి. ఈ పరంపరలో, మన మానవులకు మాత్రమే, తాము చేసే పనులను, స్వీయ-స్వేఛ్చ ద్వారా ఎంచుకునే అవకాశం కల్పించబడింది. కాబట్టి, మనం ఈ ప్రకృతి పరిణామానికి అనుకూలంగా ఉండి దోహద పడొచ్చు, లేదా, ఈ విశ్వ వ్యవస్థ ఆటంకం లేకుండా నడవటానికి, ఉపయోగపడవచ్చు. వివిధ ఆధ్యాత్మిక స్థాయిలలో ఉన్న అన్ని ప్రాణులనూ క్రమశిక్షణతో ఉంచి, నేర్పించి, ఉద్ధరించటానికే, ఈ ప్రకృతి యొక్క చక్రం, భగవంతుని ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ యజ్ఞంలో, తమ కర్తవ్యాన్ని నిర్వహించటం ద్వారా పాలుపంచుకొనని వారు, తమ ఇంద్రియములకు బానిసలై, పాపపు జీవితాన్ని గడుపుతారని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి విశదీకరిస్తున్నాడు.

యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ।
ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే ।। 17 ।।

కానీ, ఎవరైతే ఆత్మయందే రమింతురో, పరిపూర్ణ జ్ఞానంతో, ఆత్మ యందే సంతుష్టులుగా ఉందురో, వారికి ఎట్టి కర్తవ్యమూ ఉండదు.

బాహ్యమైన వస్తువుల కోసం కోరికలను త్యజించిన వారు మాత్రమే, ఆత్మ యందు రమిస్తూ, సంతుష్టులుగా ఉండగలరు. ప్రాపంచిక కోరికలే, మన బంధానికి మూలకారణం, కోరికలే, అన్ని పాపాలకీ మూల కారణం. అందుకే, వాటిని త్యజించాలి. కోరికలను త్యజించడం అంటే, ప్రాపంచిక కోరికలను వదిలిపెట్టడం. అంతేకానీ, ఆధ్యాత్మిక పురోగతి కోసం, లేదా, భగవత్ ప్రాప్తి కోసం ఉన్న కోరిక కాదు. మానసిక వాంఛలు, మనలను మాయా ప్రపంచంలోకి గిరగిరా విసిరివేస్తాయి. ఎప్పుడైతే జీవాత్మ భగవంతుని నుండి విడిపోతుందో, అప్పుడు భౌతిక శక్తి, దానిని మాయలో కప్పివేస్తుంది. ఈ మాయ వలన, తనను తాను శరీరమే అనుకుంటూ, తనను తాను ఆత్మనని మరచి పోయి ఉండటం చేత, దారుణమైన దుఃఖాలను అనుభవిస్తుంది. జ్ఞానోదయమయిన వారు, ఆత్మ అనేది భౌతిక మయినది కాదనీ, దివ్యమైనదనీ, అందుకే నాశములేనిదనీ తెలుసుకుంటారు. నశ్వరమైన ప్రాపంచిక వస్తువులు ఏవీ, నిత్యమైన ఆత్మ దాహాన్ని తీర్చలేవు కాబట్టి, ఆ ఇంద్రియ వస్తు-విషయములపై ఉండే యావ, మూర్ఖత్వం. ఈ విధంగా, ఆత్మ-జ్ఞానులైన మహాత్ములు, తమ మనస్సుని భగవంతుని యందే సంయోగం చేసి, తమలో తాము అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. భగవంతునితో సంయోగమునొందిన వారు, వేదముల శిరస్సుపై నడుస్తారు. అంటే, వారు ఇక వేదములలో చెప్పిన నియమములను, పాటించవలసిన అవసరం లేదు. 

నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన ।
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ।। 18 ।।

ఇటువంటి ఆత్మ జ్ఞానులైన వారు, తమ విధులను చేయటం వలన కానీ, చేయకపోవటం వలన కానీ, వారికి వచ్చేవీ, పోయేవీ  ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం, వారు ఇతర జీవుల మీద ఆధార పడవలసిన అవసరమూ లేదు.

జ్ఞానోదయమైన మహాత్ములు, అలౌకిక ఆత్మ స్థాయిలో ఉంటారు. వారి యొక్క ప్రతి పని కూడా, భగవత్ సేవలో అతీంద్రియమైనదే. కాబట్టి, శారీరిక స్థాయిలోనున్న ప్రాపంచిక జనులకు, వారి వర్ణాశ్రమ ధర్మముల ప్రకారం సూచింపబడిన విధులు, అటువంటి వారికి వర్తింపవు. జ్ఞానోదయమయిన జీవాత్మలు, పరిశుద్ధ మనస్సు కలిగి, భగవంతుని యందే రమిస్తూ ఉండే స్థాయిని చేరుకుంటారు. ఇటువంటి మహాత్ములు, నేరుగా భక్తియందే, పూర్తి ఆధ్యాత్మిక కర్మల యందే నిమగ్నమయి ఉంటారు. అంటే, ధ్యానం, అర్చనా, కీర్తనా, గురు సేవా వంటివి. ఇటువంటి జీవాత్మలు, తమ ప్రాపంచిక కర్తవ్యములను త్యజిస్తే, అది పాపం అనిపించుకోదు. వారు కావాలనుకుంటే, ప్రాపంచిక విధులను నిర్వర్తించవచ్చు కానీ, వాటిని తప్పకుండా చేయాల్సిన అవసరం లేదు. అటువంటి సత్పురుషులు, ప్రహ్లాదుడూ, ధృవుడూ, అంబరీషుడూ, పృథువూ, మరియు విభీషణుడూ. అతీంద్రియ స్థాయిని చేరుకున్న తరువాత కూడా, తమ విధులను నిర్వర్తించారు. ఇక కర్మ యోగులు, బాహ్యంగా తమ విధులను చేసినా, అంతర్గతంగా తమ మనస్సు, భగవంతుని యందే చేర్చిన వారు. తమ ప్రాపంచిక ధర్మాన్ని విడిచి పెట్టి, సన్యాస జీవితాన్ని తీసుకున్నవారు, కర్మ సన్యాసులు. శంకరాచార్యులూ, మధ్వాచార్యులూ, రామానుజాచార్యుల వంటి వారు, బాహ్యంగా, అంతర్గతంగా, శారీరికంగా, మన: పూర్వకంగా, భగవత్ భక్తి లోనే నిమగ్నమై ఉంటారు.
ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికిజ్ఞానోదయమయ్యే ఈ రెండు మార్గాలనూ, సూచిస్తున్నాడు.

తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ।। 19 ।।

కాబట్టి, మమకార బంధాలను విడిచిపెట్టి, ఆసక్తి రహితుడవై, నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము. కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన, మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు.

జనులు పూర్తి ఆధ్యాత్మిక జ్ఞాన స్థాయి చేరనంత వరకూ, వారి వారి విహిత కర్మలను చేస్తుండమని చెప్పాడు. జ్ఞానోదయమైన మహాత్ములు, విధింపబడిన కర్మలను చేయనవసరం లేదని అన్నాడు. కాబట్టి, అర్జునుడికి ఈ రెంటిలో ఏది యోగ్యమయినది? అంటే, ప్రస్తుతం చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలి, సన్యాసం తీసుకోవడం కన్నా, తన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించి, దానిని భగవదర్పితం చేయమని, శ్రీ కృష్ణుడు బోధిస్తున్నాడు.

ఇక మన తదుపరి వీడియోలో, ముల్లోకాలలో తన విధి గురించి, శ్రీ కృష్ణుడి సంభాషణ తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!