5.9.26

తిరుమల శ్రీవారికి నాదమే... నీరాజనం... స్వామివారిని మేల్కొలిపే నాదం... సేద తీర్చే స్వరాలు... nada neerajanam







శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి వేదం, నాదం, వాద్య నివేదనలు. వీటిలో నాదానికి విశేష ప్రాధాన్యం ఉంది. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించే సంగీతాన్ని, కీర్తనలను స్వామివారు ఆలకిస్తారన్నది పండితుల విశ్వాసం. అందుకే తిరుమలలో నాదం కేవలం సంగీతం కాదు... అది స్వామివారికి సమర్పించే ఒక విశిష్టమైన కైంకర్యం.

శ్రీ తాళ్లపాక అన్నమయ్య, శ్రీ పురందరదాసు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వంటి వాగ్గేయకారులు తమ సంకీర్తనలతో, ఆళ్వారులు తమ పాశురాలతో శ్రీవారిని ప్రసన్నం చేసుకున్నారు. తరువాత కాలంలో దేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసులు శ్రీమతి ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి మహనీయులు కూడా స్వామివారికి నాదనీరాజనం సమర్పించారు.

శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణం. ‘శ్రవణంఅంటే వినడం అని అర్థం. భక్తులు సమర్పించే భక్తిగీతాలను, వేదఘోషను, వాద్య నాదాలను స్వామివారు ఆలకిస్తారనే భావనకు ఇది మరింత ప్రత్యేకతను ఇస్తుంది.

అడవుల్లోని శబ్దాల నుంచి ఆలయ మేళవాయిద్యాల వరకు

పురాణాల ప్రకారం పూర్వకాలంలో శేషాచలం అడవుల్లోని వృషభం, ఏనుగు వంటి జంతువులు తమ అరుపులతో స్వామివారిని కొలిచేవని చెబుతారు. సంప్రదాయానికి ప్రతీకగా, అలాంటి శబ్దాలను ఉత్పత్తి చేసే వాద్యపరికరాలు తరువాత కాలంలో శ్రీవారి ఆలయంలో వినియోగంలోకి వచ్చాయి. వీటిలో వృషభానికి సంబంధించిన గౌరుగోలు, ఏనుగు ధ్వనిని పోలిన త్రిచిన్నం/త్రిశూల్‌నాల్ వంటి వాద్యపరికరాలు ఉన్నాయి.

ఇలా ప్రకృతిలోని సహజ ధ్వనుల నుంచి ఆలయ కైంకర్యాల్లో భాగమైన మేళవాయిద్యాల వరకు ఒక విశిష్టమైన నాద సంప్రదాయం తిరుమలలో కొనసాగుతూ వస్తోంది.

సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు నాదమే కైంకర్యం

శ్రీవారి రోజువారీ పూజా కైంకర్యాల్లో నాదానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. తెల్లవారుజామున సుప్రభాతం ద్వారా స్వామివారిని మేల్కొలుపుతారు. తరువాత జరిగే వివిధ కైంకర్యాల్లో వేదపారాయణంతో పాటు మేళవాయిద్యాలు కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.

మేళవాయిద్య కళాకారులకు సంగీతం ప్రదర్శన కాదు... ప్రార్థనను నాదరూపంలో సమర్పించే కైంకర్యం. స్వామివారు మేల్కొనే వేళ నుంచి వివి సేవలు, నైవేద్యాలు, ఊరేగింపులు, ఉత్సవాలు, చివరికి ఏకాంతసేవలో సేదతీరే వరకు నాదస్వరం, డోలు తదితర వాద్యాల నాదం శ్రీవారి ఆలయ నిత్యకైంకర్యాల్లో భాగంగా ఉంటుంది.

శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు మొత్తం 19 రకాల సంప్రదాయ వాద్యపరికరాలను వినియోగిస్తారు. వీటిలో డోలు, ముక్కువీణ, తిరిచినాళ్లు, గౌరుగోలు, సన్నడోలు, శృతి తదితర వాద్యాలు ఉన్నాయి.

ఆగమ సంప్రదాయాల ప్రకారం ఆలయంలో జరిగే కైంకర్యాలకు మేళవాయిద్యం ఎంతో ముఖ్యమైనది. సాధారణ రోజుల్లో సుమారు 14 సార్లు మేళవాయిద్యం వినిపిస్తుండగా, ఉత్సవాల రోజుల్లో సంఖ్య మరింత పెరుగుతుంది.

ప్రతి ధ్వనికి ఒక ప్రత్యేక సందర్భం...

నాదస్వరం శ్రీవారి ప్రధాన కైంకర్యాలు, నైవేద్య సమయాలు, ఊరేగింపులు, ఉత్సవాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. రోజుకు రెండుసార్లు నైవేద్యం గంట సమయంలో నాదస్వరం వాయిస్తారు. అర్చకులు, జీయంగార్లు విచ్చేసే సమయంలో భక్తులను అప్రమత్తం చేసేందుకు గౌరుగోలు, సన్నడోలు వంటి వాద్యాలను వాయిస్తారు.

తిరుచిన్నం వంటి వాద్యాలు మంగళహారతి, దేవతామూర్తుల ఊరేగింపులు వంటి సందర్భాల్లో ప్రత్యేక ధ్వనిని అందిస్తాయి. డోలు, సన్నడోలు కైంకర్యాల సందర్భాన్ని సూచించే లయను అందిస్తే, శృతి వాద్యం మొత్తం మేళానికి ఆధారమైన నాదాన్ని అందిస్తుంది.

నాదస్వరం కళాకారులు తెల్లచొక్కా, పంచె, ఉత్తరీయం ధరించి ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను పాటించడం కూడా సేవకు ఉన్న సంప్రదాయ గౌరవాన్ని తెలియజేస్తుంది.

బ్రహ్మోత్సవాల్లో మరింత ఘనంగా నాదం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మేళవాయిద్యాలకు మరింత విశిష్టమైన స్థానం ఉంటుంది. వాహనసేవలు, ఊరేగింపులు, వివిధ ఉత్సవ కైంకర్యాల సమయంలో మేళవాయిద్యాల నాదం తిరుమల ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మికంగా మార్మోగిస్తుంది.

సాధారణ రోజుల్లో స్వామివారి కైంకర్యాలను సూచించే నాదం, బ్రహ్మోత్సవాల సమయంలో వేలాది మంది భక్తుల మధ్య ఉత్సవ వాతావరణాన్ని మరిం ఘనంగా తీర్చిదిద్దుతుంది.

ఏకాంతసేవలో నాదం... జోలపాటలా...

రోజంతా భక్తులతో, వేదఘోషతో, మేళవాయిద్యాలతో సందడిగా ఉండే శ్రీవారి ఆలయం రాత్రి ఏకాంతసేవ సమయంలో ప్రశాంతంగా మారుతుంది. అయితే సమయంలోనూ నాదం ఆగిపోదు. స్వామివారు సేదతీరే వేళ ముక్కువీణ, తిరిచినాళ్లు, గౌరుగోలు, సన్నడోలు, శృతి వంటి వాద్యాలను మృదువుగా, వినసొంపుగా వాయిస్తారు.

ముక్కువీణ వంటి పురాతన వాద్యాలు సమయంలో మరింత సున్నితమైన ధ్వనిని అందిస్తాయి. స్వామివారిని అలంకరించి, నైవేద్యాలు సమర్పించి, తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతిని సమర్పించే సంప్రదాయంలో మృదునాదం ఒక ఆత్మీయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ఇది ఒక రకంగా ఇంట్లో చిన్నారిని జోలపాడి నిద్రపుచ్చినట్లుగా భావించే అత్యంత సన్నిహితమైన కైంకర్యం. అన్నమాచార్యుల సంకీర్తనల పరంపరలోని లాలిపాటల భావనతో స్వామివారిని నిద్రకు ఉపక్రమింపజేసే నాదసేవకు ప్రత్యేకమైన ఆధ్యాత్మికత ఉంది.

విజయనగర కాలం నుంచి కొనసాగుతున్ 19 వాద్యాల సంప్రదాయం...

తిరుమల మేళవాయిద్య సంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఆలయాల్లో ఘనమైన వాద్యబృంద సంప్రదాయాలు ప్రోత్సహించబడ్డాయని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ‘నవబత్‌ఖానాగా పేర్కొనబడే సంప్రదాయ వాద్యబృందాల్లో 19 రకాల వాద్యాలు ఉండేవని చెబుతారు.

డోలు, సన్నడోలు, తిరుచిన్నం, గౌరుగోలు, శృతి తదితర వాద్యాలతో కూడిన సంప్రదాయం కాలానుగుణ మార్పులను స్వీకరించినప్పటికీ, దాని ప్రాథమిక స్వరూపం తిరుమలలో ఇప్పటికీ కొనసాగుతోంది.

తరతరాలుగా సంగీత కుటుంబాలకు చెందిన కళాకారులు, శిక్షణ పొందిన విద్వాంసులు నాదసేవను కొనసాగిస్తున్నారు. వారి చేతుల్లో పురాతన సంప్రదాయం కేవలం కళగా కాకుండా, శ్రీవారికి సమర్పించే నిత్యకైంకర్యంగా జీవిస్తోంది.

నాదానికి ప్రాచుర్యం కల్పిస్తున్న టీటీడీ

స్వామివారికి ఇష్టమైన సంకీర్తనలు, సంగీతాన్ని భక్తలోకానికి అందించేందుకు టీటీడీ శ్రీవేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. ఇందులో అన్నమాచార్య సంకీర్తనలను రికార్డు చేసి భక్తులకు అందిస్తున్నారు.

అలాగే శ్రీవారి ఆలయం ఎదుట నాదనీరాజనం వేదికపై ప్రముఖ కళాకారులతో ప్రతిరోజూ నిర్వహిస్తున్న సంగీత, నృత్య కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

నాదస్వరం, డోలు వంటి మేళవాయిద్యాలకు ప్రాచుర్యం కల్పించడంతో పాటు, వాటి సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు టీటీడీ శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాల నిర్వహిస్తోంది.

తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో ఉన్న సుమారు 400 ఏళ్ల కాలం నాటి బ్రహ్మనగారా, బ్యాంకె వంటి పురాతన వాద్యపరికరాలు తిరుమలలో శతాబ్దాలుగా కొనసాగుతున్న నాద సంప్రదాయానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

సంగీతం కాదు... స్వామివారి నిత్యసేవ

తిరుమలలో వినిపించే ప్రతి నాదానికి ఒక సందర్భం ఉంది. సుప్రభాతంలో మేల్కొలుపు నాదం, కైంకర్యా సమయంలో మంగళనాదం, నైవేద్య సమయంలో నాదస్వర సేవ, వాహనసేవల్లో ఉత్స నాదం, చివరికి ఏకాంతసేవలో మృదువైన నాదం...

అందుకే తిరుమలలో మేళవాయిద్య కళాకారులు కనిపించని నేపథ్య కళాకారులు కాదు. వారు స్వామివారి నిత్యసేవలో అంతర్భాగం. వారి వేళ్ల నుంచి వెలువడే ప్రతి స్వరం, ప్రతి లయ, ప్రతి ధ్వని శ్రీవారికి సమర్పించే నాదనీరాజనమే.

స్వామివారు మేల్కొనాలన్నా... హాయిగా నిద్రకు ఉపక్రమించాలన్నా... తిరుమలలో నాదం ఉండాల్సిందే.

అందుకే తిరుమల కేవలం ఏడు కొండల క్షేత్రం కాదు...

ప్రతి రోజూ సంగీతంతో శ్వాసించే ఒక సజీవ ఆధ్యాత్మిక క్షేత్రం.

No comments :
Write comments