26.6.26

పద్మసరోవరంలో శ్రీ కృష్ణస్వామివారి దివ్య తెప్ప విహారం teppotsavam








తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ రుక్మిణి, సత్యభామ మేత శ్రీ కృష్ణస్వామివారు పద్మసరోవరంలోని సుందరంగా అలంకరించి తెప్పపై మూడు ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు.


వేడుకగా శ్రీ కృష్ణస్వామివారికి అభిషేకం


ఉదయం సుప్రభాతంతో ప్రారంభమైన నిత్యకైంకర్యాల అనంతరం మధ్యాహ్నం శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన ఈ పవిత్ర అభిషేకం భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తింది.


పద్మసరోవరంలో దివ్య తెప్ప విహారం


సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.15 గంటల వరకు జరిగిన తెప్పోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పద్మసరోవరంలో విద్యుద్దీపాల వెలుగుల్లో సాగిన ఈ దివ్య విహారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.


తెప్పోత్సవం అనంతరం శ్రీ కృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కరుణాకటాక్షాలతో అనుగ్రహించారు.


ఆకట్టుకున్న భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు


తెప్పోత్సవాలలో భాగంగా ఆలయ నాలుగు మాడవీధుల్లో నిర్వహించిన భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గోవింద నామస్మరణలతో పాటు సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చాయి.


ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరింధ్రనాథ్, సూపరింటెండెంట్లు శ్రీ సురేష్, శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments