టీటీడీ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శనివారం ఉదయం అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో, దేశభక్తి భావాలతో ఘనంగా నిర్వహించారు.
గిరిజనహక్కులకోసంవీరోచితపోరాటం
ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న శ్రీ మోహన్రావు నాయుడు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనలో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు తీవ్ర దోపిడీ, అణచివేత, అన్యాయాలకు గురయ్యారని తెలిపారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గిరిజనులకు అండగా నిలిచిన అల్లూరి సీతారామరాజు వారిని ఏకం చేసి, దురలవాట్లకు దూరం చేసి, యుద్ధ విద్యలు, గెరిల్లా పోరాట పద్ధతుల్లో శిక్షణ ఇచ్చి బ్రిటిష్ పాలకులను ధైర్యంగా ఎదుర్కొన్న మహోన్నత నాయకుడని కొనియాడారు.
అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి ప్రతి యువకుడికి మార్గదర్శకమని, ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు తన అసమాన త్యాగం, వీరోచిత పోరాటంతో మన్యానికి చిరస్థాయి కీర్తిని తీసుకువచ్చారని అన్నారు. ఆయన సేవా స్ఫూర్తిని ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో ఆచరణలో పెట్టాలని సూచించారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను నిర్వహించడం గర్వకారణమని తెలిపారు.
టీటీడీ చీఫ్ ఆడిట్ అధికారి శ్రీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సాయుధ పోరాటం ద్వారా మన్యం ప్రజల హక్కులను కాపాడుతూ చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. నేటి యువత ఆయన ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలోని ప్రతి సవాలును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు.
భక్తిశ్రద్ధలతోనివాళులు
అంతకుముందు టీటీడీ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అన్నమయ్య విగ్రహానికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పలువురు టీటీడీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు అల్లూరి జీవితం, దేశభక్తి, స్వాతంత్య్ర సమరంలో ఆయన పోషించిన విశిష్ట పాత్రను స్మరించుకున్నారు.
పెద్దసంఖ్యలోపాల్గొన్నఅధికారులు, ఉద్యోగులు
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు.
No comments :
Write comments