తిరుపతిలోని
ఎస్వీ ఆర్ట్స్ కళాశాల (అటానమస్) రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "పర్యావరణ పరిరక్షణకు దోహదపడే స్థిరమైన రసాయన సమ్మేళనాల తయారీ (SCSREI)" అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ రసాయన శాస్త్ర సదస్సు బుధవారం కళాశాల సమావేశ మందిరంలో వైభవంగా ప్రారంభమైంది.కళాశాల ప్రిన్సిపాల్ డా. వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ సిపిఆర్వో డా. టి. రవి, ఎస్.పీ.డబ్ల్యూ. డిగ్రీ & పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. నారాయణమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిపిఆర్వో డా. టి.రవి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ నేటి ప్రపంచానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు. హరిత రసాయన శాస్త్ర పరిశోధనలు ప్రకృతి వనరుల సంరక్షణతో పాటు కాలుష్య నియంత్రణకు సమర్థవంతమైన మార్గాలని తెలిపారు. విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే దిశగా మలచాల్సిన బాధ్యత యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులపై ఉందన్నారు. విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే దిశగా మలచాల్సిన బాధ్యత యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులపై ఉందన్నారు. పర్యావరణ హిత సాంకేతికతలను అభివృద్ధి చేస్తూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, సుస్థిరమైన ప్రపంచాన్ని అందించేందుకు విద్యార్థులు పరిశోధనా రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. విద్య, విజ్ఞానం, విలువలు సమన్వయంతోనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.
పర్యావరణహిత ఔషధ తయారీపై కీలకోపన్యాసం
ఢిల్లీ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డా. పన్నూరు వెంకటేశు "ఔషధ తయారీలో పర్యావరణహిత ద్రావకాల వినియోగం – ఔషధ సూత్రీకరణల్లో అయానిక్ ద్రవాలు, డీప్ యూటెక్టిక్ ద్రావకాల ప్రాధాన్యం" అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఔషధ తయారీలో పర్యావరణహిత ద్రావకాల వినియోగం వల్ల ఔషధాల ద్రావణీయత, స్థిరత్వం, జీవలభ్యత పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా విశేషంగా దోహదపడుతుందని ఆయన వివరించారు.
ఆధునిక పరిశోధనా ధోరణులపై నిపుణుల విశ్లేషణ
అనంతరం ఐఐటీ మద్రాస్కు చెందిన ప్రొఫెసర్ డా. రమేష్ గురుదాస్, ఐఐటీ తిరుపతికి చెందిన కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డా. సునీల్ కుమార్, ఐఐటీ ఖరగ్పూర్కు చెందిన రసాయన శాస్త్ర ప్రొఫెసర్ డా. ఏ. రాజ్ కుమార్ ఉపన్యాసాలు అందించి రసాయన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలు, ఆధునిక పరిశోధనా దిశలు, పారిశ్రామిక అనువర్తనాలు, హరిత సాంకేతికతలపై సమగ్రంగా వివరించారు.
దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు చెందిన పరిశోధక విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను మౌఖికంగా సమర్పించి శాస్త్రీయ చర్చల్లో పాల్గొన్నారు.
రసాయన శాస్త్ర విభాగాధిపతి డా. పి.వి. చలపతి కన్వీనర్గా వ్యవహరించిన ఈ జాతీయ సదస్సులో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
No comments :
Write comments