20.7.26

గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి garuda vahanam




శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున రాత్రి గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయహస్తంతో దర్శనమిచ్చి అనుగ్రహించారు.

ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేష అభిషేకాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి సేవను తిలకించారు.

సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన గరుడ వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గరుడునిపై విహరించిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తూ ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక పరవశంతో నింపారు.

జూలై 20 పార్వేట ఉత్సవం

సాక్షాత్కార వైభవోత్సవాల అనంతరం జూలై 20న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునికుమార్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, అర్చకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments