27.7.26

వైదిక మంత్రోచ్చారణల నడుమ శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు ఘన శ్రీకారం kapileswara swmay








తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాలు ఆదివారం వైదిక మంత్రోచ్చారణలు, శైవాగమ సంప్రదాయాల నడుమ భక్తిశ్రద్ధలతో త్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఆలయం అంతా వేదఘోషలు, మంగళవాయిద్యాలు, శివనామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

పంచమూర్తులకు విశేష స్నపన తిరుమంజనం


ఉత్సవాల్లో భాగంగా ఉదయం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారు, శ్రీ చండికేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం, సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ దివ్యాభిషేకాన్ని తిలకించిన భక్తులు పరమశివుని కృపాకటాక్షాలను పొందుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ


సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలను శైవాగమ శాస్త్రోక్త విధానాల ప్రకారం ఘనంగా నిర్వహించనున్నారు.

27 గ్రంథి పవిత్ర సమర్పణ

 – 28 మహాపూర్ణాహుతి

పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 27న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 28న మహాపూర్ణాహుతి నిర్వహించి శాస్త్రోక్తంగా ఉత్సవాలను ముగించనున్నారు.

ఆలయ పవిత్రత, లోకక్షేమమే పవిత్రోత్సవాల లక్ష్యం

ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే నిత్యార్చనలు, ఉత్సవాలు, ప్రత్యేక కైంకర్యాల్లో తెలిసీ తెలియక సంభవించిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా, ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వైభవం మరింత వృద్ధి చెందాలని, లోకక్షేమం, భక్తుల సర్వమంగళాలు సిద్ధించాలని సంకల్పిస్తూ శైవాగమ శాస్త్రోక్త విధానాల ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments