తిరుపతిలోని
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారం మహాపూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. వేద మంత్రోచ్చారణల నడుమ భక్తిపారవశ్య వాతావరణంలో నిర్వహించిన ఈ మహోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఉదయం యాగశాల పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశోద్ధ్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టుపవిత్ర సమర్పణ తదితర విశిష్ట ఆగమ కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సాయంత్రం పంచమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, వళ్లి–దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారు ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిస్తూ ఊరేగి అనుగ్రహించారు.
ఈ సందర్భంగా ఆలయం గోవిందనామస్మరణ, మంగళవాయిద్యాలు, వేదఘోషలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాలలు, తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments