టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారిసేవలో గ్రూప్ సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమైనదని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని సేవా సదన్-2 లో గురువారం ఉదయం ప్రారంభమైన శ్రీవారిసేవ గ్రూప్ సూపర్వైజర్ల రెండో విడత శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హాయంలో2000వ సంవత్సరంలో మొదటిసారిగా టీటీడీ శ్రీవారిసేవ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం శ్రీవారిసేవకులకు వారి ప్రాంతాల్లోనే శిక్షణ ఇచ్చేందుకు గ్రూప్ సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే తొలి బ్యాచ్ లో 1400 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. రెండో విడుతలో 2600 మందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి ఐఐఎం-అహ్మదాబాద్ వారి సహకారంతో అత్యంత ఉపయోగకరమైన శిక్షణ మెటిరియల్ రూపొందించడం జరిగిందన్నారు. ఇందులో ఆధ్యాత్మికతతో పాటు నిర్వహణ నైపుణ్యాలను నేర్చుకునేలా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ మెటిరియల్ ను పూర్తిగా అర్థం చేసుకుని శ్రీవారి సేవకులను సమర్థవంతంగా నడిపించాలని చెప్పారు.
శ్రీవారి సేవకులు తమ పాత్రను అర్థం చేసుకుని బాధ్యత, సహనంతో భక్తులకు సేవలందించాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా టీటీడీ వ్యవస్థపై పూర్తి అవగాహన తెచ్చుకుని భక్తులకు సమాచారం అందించడంలో కీలక పాత్ర వహించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారిసేవా విభాగాధిపతి డాక్టర్ టి.రవి, శ్రీవారిసేవ శిక్షకులు డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.టి శ్రీనివాస్, డాక్టర్ శరత్ కుమార్, పొలమడ రమేష్ బాబు, శ్రీవారిసేవ సిబ్బంది పాల్గొన్నారు.


No comments :
Write comments