27.8.26

ఆగస్టు 28 నుంచి 31 వరకు విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గరుడాళ్వార్ ప్రతిష్ఠ మహోత్సవాలు garudalwar




విజయవాడ టీటీడీ కల్యాణమండపం ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రుడాళ్వార్, బలిపీఠాల ప్రతిష్ఠ, సంప్రోక్షణ మహోత్సవాలను ఆగస్టు 28 నుంచి 31 తేదీ వరకు ఆగమశాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించనున్నారు.

ఆగస్టు 28 అంకురార్పణ

మహోత్సవాలకు ఆగస్టు 28న రాత్రి 7 గంటలకు ప్రార్థనా సూక్త పఠనం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణతో శ్రీకారం చుట్టనున్నారు.

ఆగస్టు 29 వైదిక కార్యక్రమాలు

ఆగస్టు 29న ఉదయం 8.45 గంటలకు విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, వాస్తుపూజ, వాస్తుహోమం, అకల్మషహోమం, పంచగవ్యప్రాశనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు యాగశాలకు సంబంధించిన వైదిక కార్యక్రమాలు జరుగుతాయి.

ఆగస్టు 30 అష్టబంధన ద్రవ్యారాధన

ఆగస్టు 30న ఉదయం 8 గంటలకు అంగహోమం, అక్షిమోచనం, పంచగవ్య, క్షీర, జలాధివాసాలు, అధివాస హోమాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు అష్టబంధన ద్రవ్యారాధన, 11 గంటలకు గరుడబింబ స్థాపన, సాయంత్రం 4 గంటలకు మహాశాంతి తిరుమంజనం, రాత్రి 7 గంటలకు మహాశాంతి హోమం నిర్వహించనున్నారు.

ఆగస్టు 31 గరుడాళ్వార్ ప్రతిష్, సంప్రోక్షణ

ఆగస్టు 31న రేవతి నక్షత్రం, తులా లగ్నంలో ఉదయం 9.15 నుంచి 10.18 గంటల వరకు శుభ ముహూర్తంలో ఆలయం చుట్టూ అష్టదిక్కుల్లో బలిపీఠాల ప్రతిష్ఠ, నూతన గరుడాలయంలో గరుడాళ్వార్ ప్రతిష్ఠ, సంప్రోక్షణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.

అనంతరం ఆలయ వాస్తుశుద్ధి, నవకలశస్నపనం, కళావాహనం, ప్రథమార్చన, గోదర్శనం, ఆచార్య సన్మానం, బ్రహ్మఘోష, యజమాన ఆశీర్వచనం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ

ఆగస్టు 31న మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో మహా అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నారు.

ఈ పవిత్ర గరుడాళ్వార్ ప్రతిష్ఠ, బలిపీఠాల ప్రతిష్ఠ, సంప్రోక్షణ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వేంకటేశ్వరస్వామివారి, గరుడాళ్వార్ దివ్య కృపాకటాక్షాలను పొందాలని టీటీడీ కోరుతోంది.

No comments :
Write comments