29.8.26

చక్రస్నానంతో ఘనంగా ముగిసిన తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు chakrasnanam







తొండమాన్‌పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజులుగా ఆగమశాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పవిత్రోత్సవాలు శుక్రవారం ఉదయం పవిత్రమైన చక్రస్నాన ఘట్టంతో వైభవంగా ముగిశాయి.


పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారికి, శ్రీ చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.


తదుపరి శ్రీ చక్రతాళ్వార్లకు చక్రస్నానం అత్యంత భక్తిభావంతో నిర్వహించడంతో పవిత్రోత్సవాల వైదిక కార్యక్రమాలు సంపూర్ణమయ్యాయి. పవిత్ర ఘట్టాన్ని వీక్షించిన భక్తులు స్వామివారి కృపకు పాత్రులయ్యారు.


సాయంత్రం ఆలయ పరిసరాల్లో గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ జరిగిన ఉత్సవం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి దివ్యదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


కార్యక్రమంలో ఏఈఓ శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ జ్ఞాన ప్రకాష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సుధీర్, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments