11.8.26

పూర్ణాహుతితో వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు poornahuti





తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో, ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు సోమవారం సాయంత్రం పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి.

పవిత్రోత్సవాల చివరి రోజైన సోమవారం ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం భక్తిభావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేష అభిషేకం చేసి స్వామివారికి పవిత్ర జలధారలతో అభిషేక సేవ సమర్పించారు.

సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భాష్యకార్ల గుడి వద్ద ఇయల్‌ శాత్తుమొర నిర్వహించారు.

ఆ తర్వాత ఆలయంలోని యాగశాలలో వేద మంత్రోచ్ఛారణల నడుమ వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం ఉత్సవమూర్తులు, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణగా సన్నిధికి తీసుకువచ్చి కుంభావాహనం తదితర పవిత్ర క్రతువులను ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు.

ఈ పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయం వేద మంత్రఘోషతో, భక్తుల గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి కృపాకటాక్షాలు భక్తులందరిపై ప్రసరించాలని ఆకాంక్షిస్తూ పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి.

ఈ కార్యక్రమాల్లో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ కె.  శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ హరికృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments