16.8.26

ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్య స్ఫూర్తితో మరింత ఉన్నతంగా భక్తులకు సేవలు అందిస్తాం- ttd addl eo






స్వాతంత్ర్య ఉద్య స్ఫూర్తితో టీటీడీలో భక్తుల సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత, పారదర్శకత, సమర్థవంతమైన పరిపాలనకు అనేక సంస్కరణలు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. 80 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు.

అనంతరం ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తిరుమలలో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్‌ బస్సులను పెద్దఎత్తున ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం తిరుమలకు 10 వేల నుండి 14 వేల వరకు వాహనాలు వస్తున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణ అత్యంత అవసరమన్నారు.

దాతల సహకారంతో మరో 37 ఎలక్ట్రిక్‌ బస్సులకు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రానున్న బ్రహ్మోత్సవాలకు సుమారు 25 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.

దీనివల్ల వాహన కాలుష్యం తగ్గడంతో పాటు భక్తులకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం అందుతుందని తెలిపారు. ఉచిత బస్సు సేవలను మరింత బలోపేతం చేసి, సుమారు ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

దాతల నుంచి సహకారం పొందడం వెనుక టీటీడీ విభాగాల సమష్టి కృషి ఉందన్నారు. అవసరమైన ప్రాజెక్టులను రూపొందించి, వాటి ప్రయోజనాలను వివరించి, దాతలను భాగస్వాములను చేయడం ద్వారా ఇటువంటి ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

ఐసీసీసీ ద్వారా దర్శనాల నిర్వహణలో సాంకేతిక విప్లవం

ఎన్ఆర్ఐ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (ఐసీసీసీ) రెండో దశ కూడా విజయవంతంగా అభివృద్ధి చెందిందని అదనపు ఈవో తెలిపారు. భక్తులు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతసేపు వేచి ఉన్నారు, ప్రతి గంటకు ఎంతమంది చేరుతున్నారు, ఎంతమందికి దర్శనం కల్పిస్తున్నారనే సమాచారాన్ని రియల్‌టైమ్‌లో తెలుసుకునే అవకాశం ఏర్పడిందన్నారు.

గత మూడేళ్ల డేటాతో పాటు తాజా డేటాను విశ్లేషించి సెలవులు, వారాంతాలు, పండుగలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేస్తున్నామని తెలిపారు. దీనివల్ల సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నామని చెప్పారు.

వన్యప్రాణుల కదలికలపై రియల్‌టైమ్‌ నిఘా

తిరుమలలో వన్యప్రాణుల కదలికలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించే ప్రాజెక్టుకు కూడా రూపకల్పన చేశామని తెలిపారు. వన్యప్రాణులు ఏ ప్రాంతంలో సంచరిస్తున్నాయి, ఎంతసేపు అక్కడ ఉన్నాయి, భక్తులకు ఎంత సమీపంలో ఉన్నాయి వంటి సమాచారాన్ని గుర్తించి సంబంధిత విభాగాలకు రియల్‌టైమ్‌ అలర్ట్‌లు అందేలా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తదుపరి దశలో ఈ వ్యవస్థను మరింత విస్తరించి భక్తులు, అటవీ సిబ్బంది భద్రతను మరింత పెంచుతామని తెలిపారు.

లగేజ్ కౌంటర్ల నిర్వహణలో సంస్కరణలు

గత ఐదు నెలల్లో లగేజ్ కౌంటర్ల ద్వారా సుమారు 2.6 కోట్ల బ్యాగులను సమర్థవంతంగా డిపాజిట్- డెలివరీ చేసినట్లు అదనపు ఈవో తెలిపారు. లగేజ్ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలో గణనీయమైన సంస్కరణలు తీసుకొచ్చామని, మరిన్ని మార్పులను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు.

ఆధునిక ఫుడ్‌ ల్యాబ్‌ ఏర్పాటు

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సహకారంతో టీటీడీలో అత్యాధునిక స్టేట్‌ లెవల్‌ ఫుడ్‌ ల్యాబ్‌ను కేవలం 9–10 నెలల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చామని అదనపు ఈవో తెలిపారు. బియ్యం, పప్పులు, వండిన ఆహారం, లడ్డూలు, నీరు తదితరాలకు సంబంధించిన వివిధ పరీక్షలను నిర్వహించి రిపోర్టులు పొందే సామర్థ్యం ఇప్పుడు టీటీడీకి ఉందన్నారు.

ఇలాంటి ల్యాబ్‌ను సాధారణంగా ఏర్పాటు చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, అయితే టీటీడీ విభాగాలు, ఇంజినీరింగ్‌, ఆరోగ్య విభాగం, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సహకారంతో వేగంగా పూర్తి చేయగలిగామని చెప్పారు.

అన్న ప్రసాద కేంద్రానికి బలమైన వేర్ హౌస్ వ్యవస్థ

టీటీడీ అన్నప్రసాదాల కోసం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుపతిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కోల్డ్‌ స్టోరేజ్‌ తదితర సదుపాయాలతో స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ వేర్‌హౌస్‌ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధమైందని, వచ్చే ఏడాది నుంచి ఏడాదిన్నరలో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

చరిత్ర, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే తిరుమల 

తిరుమలలోని వీధులకు స్వామివారి భక్తులు, ఆల్వార్లు, చారిత్రక వ్యక్తులు, ఆధ్యాత్మిక ప్రముఖుల పేర్లను పెట్టడం ద్వారా తిరుమల ఆధ్యాత్మికతను మరింత పెంచే చర్యలు చేపట్టామని అదనపు ఈవో తెలిపారు. వీరి సేవలు, చరిత్రను భవిష్యత్‌ తరాలకు పరిచయం చేసేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు.

కళ్యాణకట్ట ఆధునీకరణసిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కళ్యాణకట్టలో ఆధునిక సదుపాయాలను కల్పించేందుకు వర్క్‌ ప్లాన్‌ సిద్ధం చేశామని తెలిపారు. అక్కడ పనిచేసే సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటికే కీలక ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి హెల్త్ స్క్రీనింగ్‌ నిర్వహించామని చెప్పారు. భవిష్యత్‌లో ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సిబ్బంది ఆరోగ్య ప్రొఫైల్‌ను నిరంతరం పర్యవేక్షించే విధానం తీసుకురావాలని తెలిపారు.

లడ్డూ విక్రయాల్లో చారిత్రక రికార్డు

ఇటీవల ఒక నెలలో సుమారు 1.30 కోట్ల లడ్డూల విక్రయం జరగడం టీటీడీ చరిత్రలో అత్యధిక విక్రయాల్లో ఒకటని అదనపు ఈవో తెలిపారు. దీని వెనుక ప్రొక్యూర్‌మెంట్‌, వేర్‌హౌస్‌, తయారీ, రవాణా, విక్రయాలు, అకౌంట్స్‌, ఐటీ తదితర అనేక విభాగాల సమష్టి కృషి ఉందన్నారు.

లడ్డూపై భక్తులకు ఉన్న నమ్మకం, ప్రేమ ఈ స్థాయి విక్రయాలకు కారణమని, అదే సమయంలో టీటీడీపై మరింత బాధ్యతను పెంచుతుందని చెప్పారు.

డిజిటల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ వ్యవస్థ

ప్రొక్యూర్‌మెంట్‌ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చేందుకు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశామని తెలిపారు. త్వరలో మాన్యువల్‌ విధానం నుంచి డిజిటల్‌ విధానానికి పూర్తిస్థాయిలో మారడం ద్వారా మానవ జోక్యాన్ని తగ్గించి పారదర్శకత, జవాబుదారీతనం పెంచే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు.

ఉద్యోగుల సేవలను నందకం యాప్‌ ద్వారా పర్యవేక్షణ

హెల్త్‌, ఎఫ్‌ఎంఎస్‌, కంప్లైంట్‌ మేనేజ్‌మెంట్‌, ఎఫిషియెన్సీ మేనేజ్‌మెంట్‌ తదితర సేవలను నందకం అనే యాప్‌ ద్వారా నిర్వహించే విధానం సిద్ధమవుతోందని తెలిపారు. ఉద్యోగులు అందించే సేవలు, ఫిర్యాదుల పరిష్కార వేగం తదితర అంశాలను వ్యవస్థీకృతంగా పర్యవేక్షించేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందని చెప్పారు.

ఒకే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ర్పాటు 

తిరుమలలో పనిచేసే వివిధ విభాగాలను ఒకే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోకి తీసుకురావడానికి స్థలాన్ని గుర్తించి ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు అన్ని విభాగాలు ఒకే ప్రదేశంలో ఉంటే సమన్వయం, సమాచారం, మార్పిడి సహకారం, పరిపాలనా సామర్థ్యం మరింత పెరుగుతుందని తెలియజేశారు.

విధానపరమైన సంస్కరణలకు ప్రాధాన్యం

టీటీడీలో ప్రతి అంశానికి స్పష్టమైన నిబంధనలు, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ ఉండేలా పాలసీలను రూపొందిస్తున్నామని తెలిపారు. కాటేజ్‌ పాలసీ, డొనేషన్‌ పాలసీ ఇప్పటికే తీసుకొచ్చామని, రాబోయే కాలంలో మరిన్ని పాలసీలను తీసుకురానున్నామని చెప్పారు. దీనివల్ల భక్తులు, దాతలు, టీటీడీ మధ్య మరింత స్పష్టత, పారదర్శకత ఏర్పడుతుందని తెలిపారు.

టీమ్‌ వర్క్‌తోనే విజయాలు

టీటీడీ సాధిస్తున్న విజయాలు ఏ ఒక్క వ్యక్తివి కాదని, ప్రతి విభాగం, ప్రతి ఉద్యోగి, ప్రతి భాగస్వామి సమష్టి కృషి ఫలితమని అదనపు ఈవో స్పష్టం చేశారు. విజయంలో అందరికీ భాగస్వామ్యం ఉన్నట్లే, వైఫల్యాల నుంచి కూడా అందరూ కలిసి నేర్చుకోవాలని సూచించారు.

ఉద్యోగుల మధ్య చర్చ, అభిప్రాయ భేదాలు, నిర్మాణాత్మక విమర్శలు సంస్థ అభివృద్ధికి ఉపయోగపడతాయని, వాటిని వ్యక్తిగతంగా తీసుకోకుండా సమస్య పరిష్కారానికి ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను కూడా సానుకూలంగా స్వీకరించి, అందులోని నిజమైన సమస్యలను గుర్తించి పరిష్కరించాలని చెప్పారు.

స్వాతంత్ర్య ఉద్యమం అందించిన స్ఫూర్తిని నిరంతరం కొనసాగిస్తూ దేశం, సమాజం, సంస్థ పట్ల బాధ్యతతో, అంకితభావంతో, మానవీయ విలువలతో పనిచేయాలని ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం నాటికి మరిన్ని వినూత్న సంస్కరణలు, అద్భుతమైన ఫలితాలతో టీటీడీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఉద్యోగులు, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments