16.8.26

భక్తుల సేవే మా ధ్యేయం - ప్రతి భక్తుడికి తిరుమలలో దివ్యానుభూతి - సనాతన ధర్మ పరిరక్షణే మా సంకల్పం ttd chairman










ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తుల సేవే టీటీడీ ప్రధాన ధ్యేయమని, సనాతన ధర్మ పరిరక్షణే తమ సంకల్పమని టీటీడీ చైర్మన్‌ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ, విద్య, వైద్యం, ధార్మిక సేవలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధిలో వేగం, సేవల్లో నిబద్ధతతో టీటీడీ ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు.

స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గ‌ల ప‌రేడ్ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్, ఈవో శ్రీ ముద్ధాడ ర‌విచంద్ర‌తో క‌లిసి శ‌నివారం ఘ‌నంగా నిర్వహించారు.

టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు తొలుత జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. త‌రువాత‌ భ‌ద్ర‌తా సిబ్బంది నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. అనంత‌రం ఛైర్మ‌న్‌ ఉద్యోగుల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. వారి ప్ర‌సంగం య‌థాత‌థంగా..

శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య కైంకర్యాల్లో సేవలందిస్తున్న అర్చక స్వాములు, భక్తుల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, మీడియా మిత్రులు, అలాగే దేశ విదేశాల నుంచి తిరుమలకు విచ్చేస్తున్న భక్తకోటికి భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగఫలంగా సిద్ధించిన స్వాతంత్య్రదినోత్సవాన్ని నేడు మనం జాతీయ పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశానికి వారి నిస్వార్థ సేవలను మనం నేడు స్మరించుకోవల్సిన అవసరం ఎంతైనావున్నది. “మానవ సేవయే మాధవ సేవ” అనే ఆదర్శంతో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, సనాతన ధర్మ పరిరక్షణలో టీటీడీ ఎల్లప్పుడూ అంకితభావంతో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

భక్తుల సేవే మా ధ్యేయం :

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ప్రతి భక్తుడు శ్రీవారి దివ్యదర్శనానంతరం దివ్యానుభూతితో తిరిగి వెళ్లేలా సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా టీటీడీ బోర్డు, యంత్రాంగం పనిచేస్తున్నది.

శ్రీవారి ఆలయం :

జీయంగార్లు, ఆగమశాస్త్ర పండితుల మార్గదర్శకత్వంలో శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లో నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు :  

ఈ ఏడాది అధికమాసం కారణంగా సెప్టెంబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడు శ్రీవారి దివ్యదర్శనం, వాహనసేవలను భక్తిశ్రద్ధలతో వీక్షించేలా సమగ్ర ఏర్పాట్లతో పాటు దేశవ్యాప్తంగా సంప్రదాయ కళాప్రదర్శనలను మరింత వైభవంగా నిర్వహిస్తాం.

రూ.120 కోట్లతో అత్యాధునిక అన్నప్రసాద వంటశాల :

“అన్నదానం మహాదానం” స్ఫూర్తితో లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన, నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు దాతల సహకారంతో రూ.120 కోట్లతో మరొక వంటశాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం.

విద్యుత్ బస్సులు  :

తిరుమలను ఒక అద్భుతమైన పర్యావరణ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంలో భాగంగా, దాతల సహాకారంతో ప్రస్తుతం ఉన్న 12 ఎలక్ట్రిక్ బస్సులకు, అదనంగా మరో 32 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి, భక్తులకు పర్యావరణ హితమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.    

మ్యూజియం :

దాతల సహాకారంతో రూ.145 కోట్లతో అభివృద్ధి చేసిన తిరుమల ఎస్వీ మ్యూజియంలో శ్రీవారి సేవలు, ఉత్సవాలు, అరుదైన ఆభరణాల వైభవాన్ని 3డీ, 7డీ రూపంలో భక్తులకు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం.

ఒంటిమిట్టకు విశేష ప్రాధాన్యం :

శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని ఆధ్యాత్మిక వైభవానికి తగినట్లుగా తీర్చిదిద్దేందుకు విశ్రాంతి గృహాలు, యాత్రికుల సౌకర్యాలు, విద్యుత్ అలంకరణలు, భూసేకరణ తదితర అభివృద్ధి పనులను వేగంగా చేపట్టి, ఒంటిమిట్టను మరింత ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తున్నాం.

దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణం :

శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూరులో 19.62 ఎకరాలు, అస్సాంలోని గౌహతిలో 10.32 ఎకరాలు, తెలంగాణలోని ఖమ్మంలో 20 ఎకరాలు, కర్ణాటకలోని బెల్గాంలో 6.43 ఎకరాలు, ముంబైలోని బాంద్రా ప్రాంతంలో అదనంగా మరో 10 సెంట్లు, అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో కూడా భూమిని సేకరించి శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులను ముందుకు తీసుకెళుతున్నాం.

అదేవిధంగా గౌరవ ముఖ్య మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని రూ.140 కోట్లతో మహారాజగోపురం, పుష్కరిణి, వాహన మండపం, తదితర నిర్మాణాలతో అభివృద్ధి చేస్తున్నాం.

స్థానిక ఆలయాల అభివృద్ధి :

తిరుచానూరు, శ్రీగోవిందరాజస్వామి, శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని స్థానిక ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం.

ఆలయాల నిత్యకైంకర్యాలకు టీటీడీ మరింత చేయూత :

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాల కోసం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచాం.

దాతలకు పారదర్శకమైన, ఏకీకృత ప్రివిలేజెస్ :

టీటీడీ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు మరింత పారదర్శకతతో కూడిన ఏకీకృత ప్రివిలేజెస్‌ను అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం.

గత రెండేళ్లుగా టీటీడీలోని వివిధ ట్రస్టులకు సుమారు రూ.1500 కోట్లకు పైగా విరాళాలు అందించిన ప్రతి దాతకు టీటీడీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

శ్రీవారి సేవ   :  

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, టీటీడీకి చెందిన 64 స్థానిక, అనుబంధ ఆలయాల్లో శ్రీవారి స్వచ్ఛంద సేవ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది.  

అదేవిధంగా టీటీడీ ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్యసేవను మరింత విస్తరించి, ఎక్కువ మంది రోగులకు నిస్వార్థంగా, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాం.

టీటీడీ చరిత్రలో విద్యకు అత్యున్నత ప్రాధాన్యం :

రూ.161.40 కోట్లతో టీటీడీ విద్యాసంస్థలను ప్రపంచస్థాయి విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఆధునిక మౌలిక వసతులు, అత్యుత్తమ విద్యతో పాటు భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, క్రమశిక్షణను విద్యార్థుల్లో పెంపొందించి, సమాజానికి ఆదర్శవంతమైన భావి పౌరులను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

టీటీడీ విద్యాసంస్థల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 147 మంది విద్యార్థులకు “ప్రతిభా పురస్కారాలు” అందించి, విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాం.

విద్యార్థినీ, విద్యార్థుల్లో సనాతన ధర్మం, క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వాన్నిపెంపొందించేందుకు టీటీడీ పాఠశాలలో నైతిక విలువలు, యోగా మరియు లలిత కళలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నాము.

టీటీడీ ఆసుపత్రులు  :  

కొన్ని దశాబ్దాలుగా టిటిడి వైద్యరంగంలో సేవలు అందిస్తోంది. తిరుపతిలోని స్విమ్స్, బర్డ్ ఇతర ఆసుపత్రుల్లో వైద్యసౌకర్యాలు పెంచడం ద్వారా పేదరోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.

చిన్నారులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలందించే శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం.

స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు వివిధ విభాగాల్లో అవసరమైన ఉద్యోగ నియామకాలు చేపట్టాం.  

ధర్మప్రచారం :

వివిధ ధార్మిక ప్రాజెక్టులు, వేద-భక్తి కార్యక్రమాల ద్వారా సనాతన హిందూ ధర్మాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి, భావితరాలకు ఆధ్యాత్మిక విలువలను చేరవేస్తున్నాం.

హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల తదితర విభాగాల్లో సేవలందిస్తున్న కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి, వారి పారితోషికాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నాం.

సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయికి మరింత విస్తరించేందుకు వివిధ ధార్మిక సంస్థలకు టీటీడీ ఆర్థిక సహాయం అందిస్తోంది. ధర్మ ప్రచారం, ఆధ్యాత్మిక చైతన్యం, భారతీయ సంస్కృతి పరిరక్షణకు ఈ సహకారం ఎంతో దోహదపడుతోంది.

వేద సంరక్షణ :

వేద పారాయణ పథకం ద్వారా 791 మంది వేద పండితులను ప్రోత్సహిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో నిత్య వేదపారాయణం కొనసాగి సనాతన ధర్మ వైభవం చిరస్థాయిగా నిలిచేలా కృషి చేస్తున్నాం.

ఉద్యోగుల సంక్షేమమే సంస్థకు నిజమైన బలం :

జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని “యోగ--టీటీడీ ఆరోగ్యానంద” కార్యక్రమాన్ని తిరుపతిలో 17 కేంద్రాల్లో 14 రోజులపాటు నిర్వహించి, ఉద్యోగులు, విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందేలా ప్రతిరోజూ యోగ శిక్షణ అందించాం.

పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం  :

టీటీడీ చరిత్రలో తొలిసారిగా 2026 జూలై 31న తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో, ఈ ఏడాది జనవరి 1 నుంచి జూలై 31 వరకు పదవీ విరమణ పొందిన 280 మంది ఉద్యోగులను ఘనంగా సన్మానించాం. శ్రీవారి సేవలో విశిష్ట సేవలందించిన ఉద్యోగుల సేవలను గుర్తించి, వారి అంకితభావానికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

అసత్య ప్రచారాలకు తావులేదు  :

భక్తుల మనోభావాలను దెబ్బతీసే తప్పుడు ప్రచారాలను టీటీడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. అసత్యాలను అరికట్టి, భక్తుల విశ్వాసాన్ని పరిరక్షించేందుకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాం.

నేటి ఈ కార్యక్రమం సందర్భంగా చక్కటి పరేడ్‌ను నిర్వహించిన టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యురిటీ అధికారులు, సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.  

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి యావత్ ప్రపంచానికి శాంతి సౌఖ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.....జైహింద్‌  

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప‌న‌బాక ల‌క్ష్మీ, శ్రీ స‌దాశివ‌రావు, శ్రీ న‌రేష్‌కుమార్‌, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రి, జేఈవోలు డా.ఎ.శ‌ర‌త్‌, శ్రీ పి. గోపినాథ్‌, సివిఎస్వో శ్రీ కే వి ముర‌ళీకృష్ణ‌, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి , సీఈ శ్రీ మనోహరం, సిపిఆర్వో డా.టి.ర‌వి, డిఎఫ్వో శ్రీ డి. ఫ‌ణికుమార్ నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

No comments :
Write comments