తిరుమలలో
శుక్రవారం శ్రీ విఖనస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆస్థాన మండపంలో టీటీడీ అళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధని సభ సంయుక్త ఆధ్వర్యంలో జయంతి సభ నిర్వహించారు.
శ్రీ విఖనస మహర్షి జయంతిని పురస్కరించుకుని తిరుమలలో నిర్వహించిన సభలో పండితులు వైఖానస ఆగమ విశిష్టతను వివరించారు. శ్రీ విఖనస మహర్షి వైఖానస ఆగమానికి మూలకర్త అని, వైఖానస కల్పసూత్రం ఆధారంగా ఏర్పడిన ఈ సంప్రదాయం ఆలయ నిర్మాణం, ప్రతిష్ఠ, అర్చన, ఉత్సవాలు, జ్ఞానం, యోగం తదితర అంశాలను శాస్త్రబద్ధంగా వివరిస్తుందని తెలిపారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి వైఖానస ఆగమ విధానంలోనే అర్చనాదులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వైఖానస ఆగమం భక్తి, ధర్మం, దయ, కరుణ, సర్వజీవహితం వంటి విశాలమైన ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తుందని తెలిపారు.
ఈ ప్రాచీన జ్ఞానసంపదను పరిరక్షించి, పరిశోధించి, భవిష్యత్ తరాలకు అందించడంలో టీటీడీ చేస్తున్న కృషిని వక్తలు అభినందించారు.
ఈ కార్యక్రమానికి శ్రీ విఖనస ట్రస్ట్ కార్యదర్శి శ్రీ గంజాం ప్రభాకరాచార్యులు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా శ్రీ అగ్నిహోత్ర సనత్ కుమార్ ఆచార్యులు, ప్రధాన వక్తలుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రొఫెసర్ డాక్టర్ వేదాంతం శ్రీవిష్ణు భట్టాచార్యులు, నంద్యాల నేషనల్ కళాశాల సంస్కృత ఆచార్యులు డాక్టర్ డి.వి. హయగ్రీవాచార్యులు పాల్గొన్నారు. శ్రీ జీవీఎల్ఎన్ శ్రావణ్ కుమార్, శ్రీ అగ్నిహోత్రం శ్రీకర్, శ్రీమతి గుడిమళ్ల మాధురి, శ్రీ నారాయణ వరాహ వెంకట నరసింహ దీక్షితులు, శ్రీ గోవర్ధనం రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments