అప్పలాయగుంటలో
వైభవంగా జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో పల్లకిపై విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు.
స్వామివారి మనోహర రూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
గోవింద నామస్మరణతో మారుమోగిన మాడవీధులు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పల్లకీ వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ, గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
వైభవంగా స్నపన తిరుమంజనం – సాయంత్రం ఊంజల్ సేవ
అనంతరం ఉదయం 10.00 నుంచి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్ సేవ జరగనుంది.
సాయంత్రం గరుడ వాహనసేవ
రాత్రి 7.30 గంటలకు బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments