30.6.26

పద్మసరోవరంలో దివ్యంగా ముగిసిన శ్రీ పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు teppostsavams





తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం ఆధ్యాత్మిక వైభవం మధ్య ఘనంగా ముగిశాయి. ఐదవ రోజు శ్రీ పద్మావతీ అమ్మవారు పద్మసరోవరంలో అలంకృత తెప్పపై ఏడు ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.


ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చనలను నిర్వహించారు. మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 గంటల వరకు పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాన్ని వైభవంగా చేపట్టారు.


సాయంత్రం 6.30 గంటలకు ఉత్సవమూర్తులను పద్మసరోవరం వద్దకు వేంచేపు చేయగా, అనంతరం తెప్పోత్సవం భక్తుల గోవింద నామస్మరణల మధ్య భక్తిరసపూరితంగా జరిగింది.


గరుడవాహనంపై దివ్య మంగళ విహారం


తెప్పోత్సవం అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారు గరుడవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ దివ్యోత్సవాన్ని తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.


ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్‌వో శ్రీ రాధాకృష్ణ, సూపరింటెండెంట్‌లు శ్రీ రమేష్, శ్రీ సురేష్, శ్రీ ముని చెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments