26.6.26

పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుడిగా భక్తులను కటాక్షించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు peddasesha vahanam








అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనసేవ అయిన పెద్దశేష వాహనసేవ గురువారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు వైకుంఠనాథుడి అలంకారంలో పెద్దశేష వాహనంపై భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించి అనుగ్రహించారు.


దాస్యభక్తికి ప్రతీకగా ఆదిశేషుడు


శ్రీమహావిష్ణువుకు పరమ భక్తుడైన ఆదిశేషుడు తన పడగలతో స్వామివారికి ఛత్రంలా నీడనిస్తూ, పాన్పుగా సేవ చేస్తూ దాస్యభక్తికి ప్రతీకగా నిలుస్తాడు. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా శ్రీహరికి సేవలందించిన ఆదిశేషుడు, కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామిని మోస్తూ భక్తులకు దర్శనమివ్వడం విశేషం.


ఆకట్టుకున్న భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు


వాహనసేవకు ముందు హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్‌వీ సంగీత కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులు నిర్వహించిన భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.


ఈ వాహనసేవలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, కంకణ భట్టర్ శ్రీ సూర్యకుమార్ చార్యులు, డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్వో శ్రీ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments