6.7.26

వైభవంగా ప్రారంభమైన శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు sri sundararaja swamy







తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడగా, విశేష సంఖ్యలో క్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

వైభవోపేతంగా అభిషేకం

మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనం తదితర పవిత్ర ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా మహాభిషేకం నిర్వహించారు.

వేదమంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ అభిషేక సేవ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

పెద్దశేష వాహనంపై దివ్య మంగళ విహారం

సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో దివ్య మంగళ విహారం చేసి భక్తులకు అభయప్రదమైన దర్శనమిచ్చి అనుగ్రహించారు.

సోమవారం హనుమంత వాహనసేవ

మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీ సుందరరాజస్వామివారు హనుమంత వాహనాన్ని అధిరోహించి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అవతార మహోత్సవాల విశిష్ట చారిత్రక ప్రాశస్త్యం

పురాణ, చారిత్రక ఆధారాల ప్రకారం మధురైలోని అళగిరి పెరుమాళ్ ఆలయంపై ముష్కరుల దాడుల సమయంలో అక్కడి అర్చకులు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చినట్లు ప్రచారంలో ఉంది. అనంతరం మహంతుల కాలంలో మూలమూర్తులను ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రం రోజున తిరుచానూరుకు విచ్చేసిన సందర్భంగా ప్రారంభమై ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు కొనసాగే ఈ అవతార మహోత్సవాలను టీటీడీ ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి, అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments