22.8.26

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం varalakshmi vratam















తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం శుక్రవారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన పవిత్ర వేడుకలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

విశేష పూజలతో వరలక్ష్మీ వ్రతం

వేకువజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు చీరతో విశేషంగా అలంకరించుకుని భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

అనంతరం ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

రోజా, మల్లె, చామంతి, సంపంగి, తామర, తులసి తదితర సుగంధ, సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అర్చించారు. తొమ్మిది గ్రంథులతో అమ్మవారిని అలంకరించి, ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు ప్రతీకగా పూజించారు. అనంతరం 12 రకాల నైవేద్యాలను సమర్పించి మహా మంగళహారతితో వ్రతాన్ని ముగించారు.

మహిళలకు మంగళప్రదమైన వరలక్ష్మీ వ్రతం

వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ద్వారా సత్సంతానం, దీర్ఘమాంగల్య సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు.

సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించినందున, అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అత్యంత విశిష్టమైనదని పేర్కొన్నారు.

భక్తులకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి జేఈవో శ్రీ . శరత్ 

టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు.

వ్రత కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పుష్ప సౌందర్యంతో కనువిందు చేసి వ్రత మండపం

టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 60 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి సుమారు మూడు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 14 రకాల 30 వేల కట్ ఫ్లవర్స్‌తో ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, ముసాంబి, పైనాపిల్ తదితర పండ్లు, వివిధ రకాల పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు, ఇరువైపులా ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అష్టలక్ష్మి మూర్తులు, రంగురంగుల రోజాలు, తామరపూలతో ఆస్థాన మండపం శోభాయమానంగా అలంకరించారు.

7 ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష వీక్షణ

భక్తులందరూ వరలక్ష్మీ వ్రతాన్ని వీక్షించేందుకు ఆస్థాన మండపం, పుష్కరిణి, వాహన మండపం, ఫ్రైడే గార్డెన్స్, తొలప్ప గార్డెన్, గేట్ నం.3 తదితర ప్రాంతాల్లో మొత్తం ఏడు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

స్వర్ణరథంపై అమ్మవారి దివ్య విహారం

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జీ. భానుప్రకాశ్ రెడ్డి, శ్రీ ఎన్. సదాశివరావు, శ్రీ సురేష్ కుమార్, శ్రీమతి జానకి దేవి, శ్రీమతి రంగశ్రీ, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఇతర అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments